Wednesday, September 18, 2024

రెడ్‌స్టార్ ఏచూరి ఇక లేరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ కమ్యూనిస్టు నేత , సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) గురువారం కన్నుమూశారు. వామపక్ష ఉద్యమాలతో, అంతకు ముందు విద్యార్థి సం ఘాల ఆందోళనలతో నిండైన మేళవింపులు సొంతమైన వ్యక్తిత్వం ఆయనది. న్యూ మోనియా లక్షణాలు తరువాతి దశలో తీవ్రస్థాయి శ్వాసకోశ సమస్యలు తలెత్తాయి. ఈ దశలో స్థానిక ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందా రు. దేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఆయన పలువురి మన్ననలు అందుకున్న నేతగా నిలిచారు. అత్యుత్తమ పార్లమెంటేరియన్‌గా ఖ్యాతి దక్కించుకున్న ఏ చూరి వయస్సు 72 సంవత్సరాలు. ఆయన చనిపోయిన విషయాన్ని సిపిఎం వర్గాలు, ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. ఆయన మరణం వార్త కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు, నేతలలో తీవ్ర విషాదాన్ని నింపింది.

గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. వెంటిలేటర్ ద్వారా ఆయనకు కృత్రిమ శ్వాస అందించేందుకు యత్నించారు. అయితే కొద్దిరోజుల పాటు వెంటిలేటర్ మీదనే గడిపారు. మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల ప్రాంతంలో ఆయన కన్నుమూసినట్లు అధికారులు వెల్లడించారు. ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర సమస్యతో ఆయన బాధపడుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన సిపిఎం సంచాలక బాధ్యతల్లో ఉన్నారు. నిరాడంబర శైలి, జాతీయ అంతర్జాతీయ విషయాలపై పరిపూర్ణ అవగావహన, గ్రామీణ ప్రాంత జనం కడగండ్లపై ఆయనకు పట్టుంది. పార్లమెంట్ వేదికగా ఈ విషయాలను పలు మార్లు ప్రస్తావించారు. ఆగస్టు 19వ తేదీన ఆయన న్యూమోనియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఐసియూలో చేర్చి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే ఊపిరితిత్తులలో ఇన్‌ఫెక్షన్ ముదిరిపోవడంతో , దీనిని నయం చేయడం వీలుకాకపోవడంతో ఆయన తుదిశ్వాస విడిచిపెట్టాల్సి వచ్చింది. లంగ్స్ సంబంధిత ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఆయనకు ముప్పుగా మారిందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

జెఎన్‌యు విద్యార్థి.. ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమ సంధానకర్త
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూలాలు..మద్రాస్‌లో స్థిరపడ్డ కుటుంబం
ఏచూరి 1952 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. ఆయన పూర్వీకుల మూలాలు తెలంగాణలోని పాలమూరు జిల్లాలో ఉన్నాయి. మద్రాసులో స్థిరపడిన తెలంగాణ కుటుంబం ఆయనది. తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. ప్రాధమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ చేశారు. ఏచూరి విద్యాభ్యాసం ఎక్కువగా ఢిల్లీలోనే జరిగింది. జెఎన్‌యూలో చేరిన తరువాత ఆయన కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులు అయ్యారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. ఆయన నాయకత్వ లక్షణాలు గుర్తించి సిపిఎం 1984లో ఆయనను పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా నియమించింది. తరువాత 1992లో ఆయన పార్టీ పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. ఉమ్మడి కమ్యూనిస్టు సీనియర్ నేతలతో కూడా పలు ఉద్యమాలలో పాలుపంచుకున్న అనుభవం ఆయనది

. 2005 నుంచి 2017 వరకూ ఆయన 12 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఇక పార్టీ నిర్మాణాత్మక కార్యక్రమాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. విశాఖపట్టణంలో 2015 ఎప్రిల్ 19న జరిగిన పార్టీ 21వ కేంద్ర కమిటీ సమావేశంలో ఆయన అప్పటివరకూ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రకాశ్ కారత్ నుంచి ఈ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వ పాలసీలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన సీతారాం తరచూ ప్రతిపక్ష ఐక్యత గురించి చెపుతూ వచ్చారు. సంఘటితంగానే మోడీ కేంద్రీకృత బిజెపిని ఎదుర్కోవచ్చునని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వెలిసిన ప్రతిపక్ష కూటమి ఇండియా ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారు. తెరవెనుక సంప్రదింపులతో పలువురు నేతలను ఏకతాటికి తీసుకువచ్చారు. కాగా కాంగ్రెస్ ఎంపి , ఇప్పటి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తరచూ సీతారాం ఏచూరిని తన రాజకీయ గురువులలో ఒకరని కొనియాడిన సందర్భాలు ఉన్నాయి.

ఏచూరికి రాహుల్ ఇతర నేతల నివాళి
సీతారాం ఏచూరి మృతి వార్త తెలియగానే అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. విభిన్న సంస్కృతుల భారతదేశ స్వరూపం గురించి ఏచూరికి ప్రగాఢ అవగావహన ఉందని కొనియాడారు. భారతదేశ ప్రధాన సంవిధానానికి ఇంతకాలం సంరక్షకుడిగా నిలిచారని చెప్పారు. ఆయన ఓ స్నేహితుడు, గురువు, కుటుంబానికి, సన్నిహితులు, అభిమానులకు ప్రగాఢ సంతాపం అని తెలిపారు. ఆయన గొప్ప పార్లమెంటేరియన్, సహృదయులు, వెన్నుచూపని మార్కిస్టు అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. మానవతావాది, బహుభాషా ప్రజ్ఞాశాలి. సిపిఎం పునాదికర్త అని కొనియాడారు. సలాం , మీరు త్వరగా వదిలిపెట్టి వెళ్లారు. అయితే మీరందించిన సేవలు అమూల్యం , చిరస్మరణీయం అని పలువురు నేతలు ప్రకటన వెలువరించారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంతాపం తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి నేత మమత బెనర్జీ తరఫున సంతాపం వ్యక్తం అయింది. జాతీయ రాజకీయాలకు ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు.

ఏచూరి చివరి కోరిక మేరకు
మృతదేహం ఎయిమ్స్‌కు అప్పగింత
అంత్యక్రియలు లాంఛనాలు లేవు
సిపిఎం వర్గాలు వెల్లడి
కన్నుమూసిన సీతారాం ఏచూరి పార్థీవ దేహాన్ని వెంటనే కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు అప్పగించారు. తన మరణం తరువాత మృతదేహాన్ని వైద్య శాస్త్ర విద్యార్థుల పరిశోధనలకు పనికి వచ్చే విధంగా ఆసుపత్రికి అప్పగించాలని , అంత్యక్రియలు వద్దని ముందుగానే ఏచూరి తన వారికి చెప్పారు. ఈ మేరకు ఆయన మృతదేహాన్ని ఎయిమ్స్‌కు అప్పగించిన విషయాన్ని పార్టీ సీనియర్ నేత రాఘవులు తెలిపారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ కూడా నిర్థారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News