Monday, July 1, 2024

11నిమిషాలు..రూ.18లక్షలు

- Advertisement -
- Advertisement -

ఫెడెక్స్ పేరుతో సైబర్ నేరస్థులు చేతిలో మోసపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను హైదరాబాద్ పోలీసులు రక్షించారు. సైబర్ నేరస్థులు చెప్పిన మాటలకు భయపడి రూ.18లక్షలు పంపించిన బాధితుడికి ఫిర్యాదు చేసిన 11 నిమిషాల్లోనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు స్పందించి డబ్బులు ఆపివేశారు. పోలీసుల కథనం ప్రకారం…అంబర్‌పేట్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు ఫెడెక్స్ కొరియర్ సంస్థ పేరుతో సైబర్ నేరస్థులు ఫోన్ చేశారు. మీ ఆధార్ కార్డు నంబర్‌తో ముంబాయి నుంచి ఇరాన్‌కు డ్రగ్స్ కొరియర్ చేశారని, తమను ముంబాయి సైబర్ క్రైం పోలీసులు తమను సంప్రదించారని చెప్పారు. మీపై కేసు నమోదు చేశారని నకిలీ డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో పంపించారు. వెంటనే తాము చెప్పినట్లు డబ్బులు పంపించాలని, వాటిని పరిశీలించిన తర్వాత తిరిగి పంపిస్తామని చెప్పారు.

ఆందోళనకు గురైన బాధితుడు తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో బ్యాంక్ నుంచి రుణం తీసుకుని పంపాలని చెప్పడంతో బాధితుడు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని నిందితులు చెప్పినట్లు రూ.18లక్షలు పంపించాడు. కానీ మళ్లీ సైబర్ నేరస్థులు తిరిగి పంపించలేదు, దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు గురువారం సాయంత్రం 6.58 గంటలకు ఫిర్యాదు చేయగా, డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ వెంటనే స్పందించాడు. ఎన్‌సిఆర్‌పి పోర్టల్ హైదరాబాద్ సిటీ పరిశీలించాడు. తర్వాత ఎన్‌సిఆర్‌పి పోర్టల్ ఆన్‌లైన్‌లో బాధితుడి బ్యాంక్ ఖాతా నంబర్‌తో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన సిబ్బంది 7.09 గంటలకు పేమెంట్ కాకుండా బ్యాంక్ ఖాతాను బ్లాక్ చేశారు. దీంతో బాధితుడి డబ్బులు తిరిగి వచ్చాయి. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News