Thursday, October 3, 2024

తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : జపాన్ దేశంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు బుధవారం తోషిబా ప్రధాన కార్యాలయం, పరిశ్రమల సందర్శన, ఫ్యూయల్ సెల్ విభాగాలఏర్పాటు, తదితర అంశాలపై సమావేశాలతో బిజీ బిజీగా గడిపారు. ఉదయం 8 గంటలకు ఆయన టోక్యో నగరం నుండి బయలుదేరి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ బహుళ జాతి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉత్పత్తుల దిగ్గజ కంపెనీ తోషిబా వారి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్, సింగరేణి సిఎండీ ఎన్.బలరామ్, భారత రాయబార కార్యాలయ అధికారులు బన్సల్ దేవజాని సందర్శనలో పాల్గొన్నారు.

తోషిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగే రిజో కవహర, కనేట తదితర ఉన్నతాధికారులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి, అధికారులకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తోషిబా ఉత్పత్తుల సేవలను వారు వివరించారు. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి కంపెనీ అయిన తోషిబా ఇప్పుడు పర్యావరణహిత సోలార్ ఉత్పత్తులలో అగ్రగామిగా ఉందని వివరించారు. ముఖ్యంగా సోలార్ విద్యుత్తులో వినియోగించే ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ, ఫ్యూయల్ సెల్ ,బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ, శక్తివంతమైన జనరేటర్లు, జీరో కార్బన్ ఎమిషన్ టెక్నాలజీలను వృద్ధి చేశామని సంబంధిత వివరాలను తెలిపారు.

తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు : తెలంగాణలో పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి భట్టి విక్రమార్క మల్లు చెప్పారు. దీనికి ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్ కూడా పెద్ద సంఖ్యలో కావలసి ఉందని, అలాగే రానున్న కాలంలో ఫ్యూచర్ సిటీలో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ వినియోగం ఎక్కువగా ఉంటుంది కనుక రాష్ట్రంలో సంబంధిత యూనిట్ లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఆధునిక జనరేటర్లు, విద్యుత్ పొదుపు, నిల్వ ఉత్పత్తులు, విద్యుత్ వాహనాల బ్యాటరీలు,

సంబంధిత సేవలు తెలంగాణలో అవసరమై ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెట్టుబడులతో తరలి రావాలని ఆయన సూచించారు. తెలంగాణను ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఫ్యూచర్ సిటీలో గ్రీన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి అగ్రస్థానం ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులు అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపుదిద్దాలని భావిస్తున్నామని, ఈ నేపథ్యంలో తోషిబా సేవలు అవసరమవుతాయన్నారు. అలాగే సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా బొగ్గుతో పాటు లిథియం వంటి ఇతర ఖనిజ తవ్వకాల లోనికి ప్రవేశించనున్నదని, లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందుకు పోవచ్చని సూచించారు.

తోషిబా ఉత్పత్తుల కేంద్ర సందర్శన : ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు సమీపంలోని తోషిబా ఫ్యూయల్ సెల్ తయారీ యూనిట్ ను సందర్శించారు. న్యూక్లియర్ పవర్, థర్మల్ పవర్ ఉత్పత్తిలో వినియోగించే టర్బైన్లు, జనరేటర్ల తయారీ యూనిట్ ని పరిశీలించారు. ఫోటో వోల్టాయిక్ మాడ్యూల్స్, ఇతర బ్యాటరీల తయారీ విధానాన్ని పరిశీలించారు.

తెలంగాణలో తోషిబాను మరింతగా విస్తరిస్తాం : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సూచన మేరకు తోషిబా అధికారులు స్పందిస్తూ భారతదేశంలో కేవలం మూడు రాష్ట్రాల్లో మాత్రమే తాము తమ యూనిట్లను ప్రారంభించామని, దీనిలో తెలంగాణ ప్రముఖమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, వ్యాపార విస్తరణకు ఎంతో అనుకూలంగా ఉన్నందున స్వయంగా కానీ, రాష్ట్ర ప్రభుత్వంతో ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ ఇక్కడ తమ పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత ఈవీ వెహికల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుతామని, ప్లాంట్ విస్తరణకు ప్రయత్నిస్తామని తోషిబా అధికారులు తెలిపారు. అనంతరం భట్టి విక్రమార్క ,ఇతర అధికారుల బృందం సాయంత్రం 4 గంటలకు బుల్లెట్ ట్రైన్ ద్వారా అక్కడికి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒసాకా పట్టణానికి బయలుదేరింది. అక్కడ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ పానాసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని, పరిశ్రమలను సందర్శించనున్నారు.

ప్రజా రవాణాలో జపాన్ బుల్లెట్ ట్రైన్ ప్రపంచానికే ఆదర్శం : ప్రజా రవాణా వ్యవస్థలో జపాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. టోక్యో నగరం నుంచి ఆయన బుల్లెట్ ట్రైన్ లో మధ్యాహ్నం ఒసాకా పట్టణానికి బయలుదేరారు. 700 కిలోమీటర్ల పొడవైన ఈ రైలుమార్గాన్ని కేవలం కేవలం 2 గంటల 20 నిమిషాలలో బుల్లెట్ ట్రైన్ ద్వారా చేరుకున్నారు. ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని, ట్రైన్ లో సౌకర్యాలు ఎంతో బాగున్నాయని, ఈ తరహా రవాణా వ్యవస్థను తెలంగాణలో కూడా అభివృద్ధి పరచడానికి పూనుకోవాలని రైల్వే శాఖను కోరనున్నట్లు భట్టి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News