హైదరాబాద్: సౌర విద్యుత్ వినియోగంలో దక్షిణ మధ్య రైల్వే మరో ముందడుగు వేసింది. జోన్ పరిధిలోని నంద్యాల, యర్రగుంట్ల సెక్షన్ల మధ్య తొలి సౌర విద్యుత్ మార్గం అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్గం పరిధిలోని ఎనిమిది స్టేషన్ లలో అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో తొలి సౌర విద్యుత్ సెక్షన్గా ప్రకటించామని జిఎం.గజానన్ మాల్య వెల్లడించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో గుంతకల్లు డివిజన్ పరిధిలోని నంద్యాలయర్రగుంట్ల సెక్షన్ మార్గం గుంతకల్లురేణిగుంట, డోన్, గుంటూరు రైల్వే మార్గానకి ముఖ్యమైన అనుసంధాన మార్గంగా వెల్లడించారు.
ఈ నూతన వ్యవస్థ ఏర్పాటు ద్వారా ఉద్గారాలు తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. సౌర విద్యుత్తును ఉపయోగించుకోవడానికి250,125 వాట్ల సౌర ఫలకాలతో కూడిన 37కిలోవాట్ల శక్తి గల ఆఫ్ గ్రిడ్ రూఫ్ టాప్ సౌర వ్యవస్థలను ప్రతి స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగిదని వివరించారు. ప్రతి ఏటా రూ.5లక్షల ఆదాతో పాటు ప్రతి ఏటా 49 మెట్రిక్ టన్నుల ఉద్గారాలను కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో పర్యావరణ హిత సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేసిన అధికారులు, ఉద్యోగులను జిఎం ప్రత్యేకంగా అభినందించారు.