అల్లు అర్జున్ తన అభిమానులకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. మంగళవారం బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించే కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2 బ్లాక్ బస్టర్ అనంతరం బన్ని తర్వాతి ప్రాజెక్టు కోసం అభిమానుల ఎదురుచూపులకు ఎట్టకేలకు పుల్ స్టాప్ పడింది. బన్ని తన నెక్ట్స్ ప్రాజెక్టును తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆప్టేడ్ ఇస్తూ నిర్మాణ సంస్థ.. ఫ్యాన్స్కు స్పెషల్ సర్ప్రైజ్ వీడియోను రిలీజ్ చేసింది.
ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వీడియోలో చూపించారు. ఈ వీడియోను చూస్తే.. హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. దీని కోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్లోని ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థను సంప్రదించారు. హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్కు స్క్రీన్ టెస్ట్ కూడా చేసినట్లు వీడియోలో చూపించారు. పుష్ప 2 సినిమా తర్వాత బన్ని పాన్ వరల్డ్ సినిమా చేస్తుండటంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నారు. కాగా, ఈ మూవీకి సంబంధించిన నటీనటుల, ఇతర వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.