భక్తులకు అందించేందుకు వీలుగా
సమగ్ర నివేదిక రూపొందించిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు
టిటిడి ఈవోకు నివేదికను అందించిన బృందం
తిరుమల: శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత బాధ్యతగా సేవా భావంతో సేవలు అందించేందుకు శ్రీసత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు సభ్యుల బృందం సమగ్రనివేదికను రూపొందించింది. ఈ బృందం మంగళవారం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో శ్రీ జె. శ్యామల రావుకు నివేదికను అందించారు.
శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దేశంలో పేరొందిన ఆధ్యాత్మిక సంస్థల నిర్వహణా పరమైన సూచనలను, సలహాలను తీసుకుని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో భాగంగా ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన నలుగురు బృందం (1. శ్రీ రఘుపాత్రుని లక్ష్మణరావు, రాష్ట్ర అధ్యక్షులు, 2. శ్రీ చుండూరి సురేంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షులు, 3. శ్రీ కొమరగిరి శ్యామ్ ప్రసాద్, రాష్ట్ర సేవా సమన్వయకర్త, 4. శ్రీ చెవిటి విశ్వనాథ రెడ్డి, రాష్ట్ర జాయింట్ సేవా సమన్వయకర్త) ఫిబ్రవరి 28 నుండి 5 రోజుల పాటు తిరుమలలో క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పరిశీలించి నివేదికను తయారు చేసి టిటిడి ఇఒకు అందించారు.
నివేదికలో సేవకులకు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్, సులభతరంగా రిజిస్ట్రేషన్ , క్షేత్ర స్థాయిలో శిక్షణ , గ్రామ స్థాయిలో ధర్మ ప్రచారానికి సేవకులతో సమన్వయం వీటితో పాటు శాఖల వారీగా చేపట్టాల్సిన అంశాలను, సౌకర్యాలను నివేదిక రూపంలో ఇఒకు అందించారు. సదరు 7 పేజీల నివేదిక ఇచ్చిన ప్రతినిధులను ఈ సందర్భంగా ఇఒ అభినందించారు. శ్రీవారి సేవకుల సేవలపై శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు ఇచ్చిన నివేదిక మరింత ఉపయోగకరంగా ఉందని, సదరు నివేదికలోని అంశాలను అమలు చేసి శ్రీవారి భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందని ఇఒ చెప్పారు. ఈ సందర్భంగా నివేదికపై తదుపరి చర్యలు తీసుకోవాలని సిపిఆర్ఒ డా.టి.రవిని ఆదేశించారు.