Saturday, September 28, 2024

విద్యార్థిని బలి ఇచ్చిన స్కూలు యజమాని

- Advertisement -
- Advertisement -

తన పాఠశాల, తన కుటుంబం మరిన్ని సిరిసంపదలను సాధించాలన్న దుర్బుద్ధితో దాని యజమాని తన పాఠశాలలోనే రెండవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని బలి ఇచ్చాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగింది. సోమవారం జరిగిన ఈ హత్యకు సంబంధించి పాఠశాల యజమాని, డైరెక్టర్‌తోపాటు స్కూలు ప్రిన్సిపాల్, ఇద్దరు టీచర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ రెండవ తరగతి విద్యార్థిని గొంతు నులిమి చంపినట్లు పోస్టు మార్టమ్ నివేదిక వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. తాంత్రిక పూజలను నమ్మే డిఎల్ పబ్లిక్ స్కూలు యజమాని

జశోధన్ సింగ్ స్కూలుతోపాటు తమ కుటుంబం మరింతగా సిరిసంపదలను పెంపొందించుకోవడడానికి ఒక చిన్నారిని బలి ఇవ్వాలని తన కుమారుడు, స్కూలు డైరెక్టర్ దినేష్ బఘేల్‌కు చెప్పాడు. సెప్టెంబర్ 23న తమ స్కూలులోనే 2వ తరగతి చదువుతున్న కృతార్థ్ అనే బాలుడిని స్కూలు హాస్టల్ నుంచి రాంప్రకాశ్ అనే టీచర్, దినేష్ బఘేల్, జశోధన్ సింగ్ అపహరించారు. బలి ఇచ్చేందుకు ఆ బాలుడిని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఇంతలో ఆ బాలుడు నిద్రలో నుంచి లేచి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ పిల్లాడి నోరు మూయించేందుకు అతడి గొంతు నులిమారు. మరో టీచర్ వీర్‌పాల్ సింగ్, ప్రిన్సిపాల్ లక్ష్మణ్ సింగ్ ఆ ప్రదేశంలోకి ఎవరూ రాకుండా చూసేందుకు కాపలా కాశారు.

ఆ తర్వాత ఆ బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసిన నిందితులు కృతార్థ్ ఆరోగ్యం బాలేదని, అతడిని బఘేల్ కారులో ఆసుపత్రికి తీసుకువెళుతున్నామని తెలిపారు. అయితే నిందితులు నేరుగా ఆసుపత్రికి వెళ్లకుండా కారు ఆపి కృతార్థ్ మరణించినట్లు పోలీసులకు సమాచారం అందచేశారు. పోలీసులు ఆ బాలుడికి పోస్టుమార్టమ్ నిర్వహించగా గొంతు నులమడంతో ఊపిరిఆడక మరణించినట్లు వెల్లడైంది. ఇంటరాగేషన్‌లో నిందితులు తామే ఆ బాలుడిని గొంతు నులిమి చంపినట్లు చెప్పినట్లు ఎఎస్‌పి తెలిపారు. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News