Wednesday, September 18, 2024

మల్లారెడ్డి అగ్రికల్చర్ కళాశాల ఎదుట విద్యార్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాలలో గుండెపోటుతో మృతి చెందిన బీటెక్ ఫస్టియర్ విద్యార్థికి న్యాయం చేయాలని, కళాశాలలో సౌకర్యాలు కల్పించాలని కోరుతూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళన దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సోఫాకు నిప్పంటించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాదాపు మూడు నుంచి నాలుగు గంటల వరకు కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి సంఘాలు మద్దతు తెలపడంతో ఆందోళన తారా స్థాయికి చేరింది. మల్లారెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. పోలీసులు జోక్యం చేసుకున్నప్ప టికీ విద్యార్థులు ఎక్కడ తగ్గలేదు. చివరకు మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి దిగివచ్చి పరిస్థితిని శాంతింప చేశారు.

విద్యార్థుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని, గుండెపోటుతో మృతి చెందిన అరుణ్ కుమార్ అనే విద్యార్థికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో చివరకు విద్యార్థులు శాంతి ఇచ్చారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న అరుణ్‌కుమార్ అనే విద్యార్థి తరగతి గదిలో ఉండగా గుండెపోటుతో మృతి చెందాడు. విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. సకాలంలో అంబులెన్స్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్ల విద్యార్థి మృతి చెందాడని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. అంబులెన్స్ ఏర్పాటు చేయాలని విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. విద్యార్థుల డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని, ముఖ్యంగా అన్ని క్యాంపస్లకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని మల్లారెడ్డి విద్యా సంస్థల డైరెక్టర్ ప్రీతి రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులకు హెల్త్ చెకప్ క్యాంపులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News