అంతరిక్షంలో దాదాపు తొమ్మది నెలలు చిక్కుకుపోయి చివరికి భూమికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలయమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ సోమవారం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తమ రోదసి అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అడిగిన అనేక ప్రశ్నలకు జవాబులు ఇచ్చారు. ‘అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది?’ అని అడిగిన ప్రశ్నకు సునీతా ‘భారత్ చాలా అద్భుతంగా కనిపించింది. మేము హిమాలయాల మీదుగా సాగిన ప్రతిసారి నా సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ ఆ మంచుకొండల దృశ్యాలను కెమెరాలో బంధించేవారు. తూర్పు వైపు నుంచి గుజరాత్, ముంబై వంటి ప్రాంతాలను దాటుకుంటూ వెళుతున్నప్పుడు తీరం వెంబడి ఉండే మత్సకారుల పడవలు మాకు దారి చూపే దీపంలా(బీకన్) ఉపయోగపడేవి. ఇక మొత్తం భారత దేశం విషయానికి వస్తే, పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్వర్క్, చిన్న నగరాల మీదుగా వెళుతున్నట్లు కనిపించేది. ఇక హిమాలయాల విషయం గురించి చెప్పాల్సివస్తే, భారత దేశంలోకి అడుగుపెడుతున్న ముందంజ(ఫోర్ఫ్రంట్)లా అద్భుతంగా ఉంటుంది’ అని వివరించారు.
ఇదివరలో స్కాడ్రన్ లీడర్ రాకేశ్ శర్మ సోవియట్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు. అపట్లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనను, ‘అక్కడి(అంతరిక్షం) నుంచి భారత్ ఎలా కనిపిస్తోంది?’ అని అడిగినప్పుడు ఆయన, ‘సారే జహాన్ సే అచ్ఛా’ అని జవాబిచ్చారు. ఇప్పుడు సునీతా కూడా తనదైన రీతిలో అద్భుతంగా వివరించారు. ఇదిలావుండగా భారత్కు వచ్చే విషయాన్ని సునీతా విలియమ్స్ ప్రస్తావించారు. ‘భారత్ నా తండ్రి పుట్టిన దేశం. భారత్కు రావాలని ఉంది. అక్కడి నా బంధువులు, ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్ష అనుభవాలను వారితో పంచుకోవాలని ఉంది’ అన్నారు. సునీత తండ్రి దీపక్ పాండ్య గుజరాత్ నుంచి 1958లో అమెరికాకు వెళ్లారు. ఓహియోలోని క్లీవ్ల్యాండ్లో ఇంటర్న్షిప్, మెడిసిన్లో ట్రయినింగ్ చేశారు. అక్కడే ఉర్సలిన్ బోన్నీ పాండ్యను 1965 సెప్టెంబర్ 19న వివాహం చేసుకున్నారు.వారికి ముగ్గురు సంతానం. సునీత వారి చిన్న కూతురు.