Friday, September 27, 2024

నిరుపేద దళిత విద్యార్థికి సుప్రీం భరోసా

- Advertisement -
- Advertisement -

జెఇఇ అడ్వాన్డ్‌లో అర్హత సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి ధన్‌బాద్‌లో సీటు సంపాదించినప్పటికీ యాక్సెప్టెన్స్ ఫీజు కింద రూ. 17,500 కట్టడానికి దబ్బులేక సీటు కోల్పోయిన నిరుపదే దళిత యువకునికి సాయం చేసేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత తెలిపింది. సాధ్యమైనంత వరకు సాయం చేస్తామని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూబ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం బుధవారం 18 ఏళ్ల అతుల్ కుమార్ అనే యువకుడికి హామీ ఇచ్చింది. అయితే జూన్ 24న ఫీజు డిపాజిట్ చేసే గడువు ముగిసిన తర్వాత ఈ మూడు నెలలు ఏం చేస్తున్నావని ఆ విద్యార్థిని ధర్మాసనం ప్రశ్నించింది. సీటును బ్లాక్ చేసేందుకు యాక్సిప్టెన్స్ ఫీజు కింద రూ. 17,500 చెల్లించడంలో నిరుపేదలైన అతుల్ కుమార్ తల్లిదండ్రులు విఫలమయ్యారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న సీటును కాపాడుకునేందుకు వారు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్‌ను, జార్ఖండ్ న్యాయ సేవా సంస్థను, మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

అతుల్ కుమార్ తన రెండవ, చివరి ప్రయత్నంలో జెఇఇ అడ్వాన్డ్ క్లియర్ చేశాడని, సుప్రీంకోర్టు ఆదుకోకపోతే కుమార్ ఇక జీవితంలో ఆ పరీక్షను రాయలేడని అతని తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. కొద్దిపాటి వాదనల అనంతరం ధర్మాసనం ఈ ఏడాది పరీక్షను నిర్వహించిన జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ, ఐఐటి అడ్మిషన్స్, ఐఐటి మద్రాసుకు నోటీసులు జారీచేసింది. ఆ యువకుడి కుటుంబ దీన ఆర్థిక పరిస్థితిని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఐఐటి ధన్‌బాద్‌లో సీటు కేటాయించిన తర్వాత నాలుగురోజుల్లో అంటే జూన్ 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు రూ. 17,500 నగదును సమకూర్చడం ఆ కుటుంబానికి సాధ్యం కాలేదని ఆయన తెలిపారు. కుమార్ తండ్రి రోజుకూలీ కింద పనిచేస్తారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలోని తితోరా గ్రామంలో వీరు నివసిస్తున్నారు. కాగా..అతుల్ కుమార్‌కు సాయం చేయడానికి జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ కూడా నిస్సహాయతను వ్యక్తం చేసింది. జార్ఖండ్‌లోని సెంటర్‌లో జెఇఇ పరీక్ష రాసినందున జార్ఖండ్ న్యాయ సేవా సంస్థను అతుల్ సంప్రదించగా వారు మద్రాసు హైకోర్టును ఆశ్రయించవలసిందిగా సూచించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించవలసిందిగా హైకోర్టు అతనికి సూచించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News