Saturday, April 19, 2025

ఎంఎల్‌ఎల ఫిరాయింపు కేసులో తీర్పు రిజర్వు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ‘మీ దృష్టిలో రీజనబుల్ టైమ్ అంటే ఏమిటి?’ అని తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ తరఫున వాదించిన అభిషేక్ మను సింఘ్వీని సుప్రీంకోర్టు జస్టిస్ బిఆర్ గవా య్ ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసు ల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. 10 మంది ఎంఎల్‌ఎలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్, ఎంఎల్‌ఎలు పాడి కౌశిక్‌రెడ్డి, కెపి వివేకానంద దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కౌశిక్‌రెడ్డి, కెపి వివేకా నంద తరఫున ఆర్యామ సుందరం వాదించారు. అనంతరం ఇరు పక్షాల వాదనలను ముగించిన దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.

అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన
వ్యాఖ్యలపై ‘సుప్రీం’ ఆగ్రహం
విచారణ సందర్భంగా బిఆర్‌ఎస్ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోర్టులో ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి తీవ్రంగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు. కోర్టు విచారణలో ఉన్న అంశంపై వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కోర్టు పరిధిలో ఉన్న అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకు పూర్తి గౌరవం ఉందని, మిగతా రెండు వ్యవస్థల నుంచి అలాంటి గౌరవాన్ని తాము కోరుకుంటున్నా మని ఆయన అన్నారు.

ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎనిమిది వారాల్లో తుది తీర్పు వెలువరిం చాలని ఆర్యమా సుందరం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఎంఎల్‌ఎల అనర్హత కేసులో స్పీకర్‌కు గడువు విధించిన సింగిల్ బెంచ్ తీర్పు సరికాదని అభిషేక్ మను సింఘ్వీ మరోసారి కోర్టుకు వెల్లడించారు. స్పీకర్ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్ బెంచ్ తీర్పు సరైనదేనని సమర్థించారు.

స్పీకర్‌ను కూడా కోర్టులో నిలబెట్టాం
స్పీకర్ సర్వస్వతంత్రుడని, ఆయనను కోర్టులు శాసించలేవన్న వాదనపై జస్టిస్ బిఆర్ గవాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై న్యాయస్థానాలు చేతులు కట్టుకుని కూర్చోవాలా? అని ప్రశ్నించారు. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ స్పీకర్‌ను కోర్టులో నిలబెట్టామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఫిరాయింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లేనని జస్టిస్ బిఆర్ గవాయి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News