Tuesday, March 4, 2025

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల అనర్హతపై సుప్రీం కీలక ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల అనర్హతపై మరోసారి సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వ వైఖరిపై గర్హించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మార్చ్ 22 వరకూ సమా ధానం ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలోని పది మంది బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటీషన్లపై సుప్రీం కోర్టులో జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతిసారీ రీజనబుల్ టైమ్ కావాలని ప్రభుత్వం కోరుతుండటంతో సుప్రీంకోర్టు మండిపడింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా అని అసహనం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలని ప్రశ్నించింది. ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని కోరింది. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్’ అనే తీరు మంచిది కాదని జస్టిస్ బిఆర్ గవాయి చెప్పారు.

బిఆర్‌ఎస్ తరపున సీనియర్ న్యాయవాది అర్య మ సుందరం వాదనలు విన్పించారు. ప్రతిసారీ కావాలనే ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారని కోర్టుకు వెల్లడించారు. తమ పార్టీ ఎంఎల్ ఎలు పార్టీ మారారంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి ఏడాది గడిచిందని, ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరిగిందని వివరిం చారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రివర్స్ చేసిందన్నారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడం అంటే రాజ్యాంగం ఇచ్చి విధుల నిర్వహణలో విఫలమైనట్టేనన్నారు. సరైన సమయం అంటూ స్పీకర్ కాలయాపన చేయడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మహా రాష్ట్ర తరహాలో ఎంఎల్‌ఎల పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆగుతారా అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే అంశంపై మార్చ్ 22 వరకు సమాధానం ఇవ్వాలంటూ తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణను మార్చ్ 25కు వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News