Friday, September 20, 2024

కోచింగ్ సెంటర్లా?… డెత్ ఛాంబర్లా?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ రాజేంద్రనగర్ యూపిఎస్‌సి కోచింగ్ సెంటర్ సెల్లార్ లైబ్రరీలో జులై 27న వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్‌సి విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే. రావూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్‌లో మృతి చెందిన ముగ్గురిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయాయాదవ్ (25), తెలంగాణకు చెందిన తాన్యా సోని (25), కేరళకు చెందిన నెవిన్ డెల్విన్ (24) ఉన్నారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనిపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో ఈ సంఘటనను సుప్రీం కోర్టు విచారణకు సుమోటోగా స్వీకరించింది.

ఈ మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఐఎఎస్ కావాలనే లక్షంతో ఢిల్లీకి వచ్చిన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నగరంలోని కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్లు (మృత్యుకుహరాలు)గా మారాయి. వాటిని సక్రమంగా నిర్వహించడంలో అధికారులు నిర్లక్షం వహించారు. ఈ సంఘటన అందరి కళ్లు తెరిపించింది” అంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్‌ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోచింగ్ సెంటర్ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్సీఆర్ భద్రత చర్యలపై వివరణ ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది.

ఇనిస్టిట్యూట్‌లో భద్రతా ప్రమాణాలు అందించేవరకూ ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకోవచ్చని సూచించింది. ఇప్పటివరకు నిర్దేశించిన భద్రతా నిబంధనల ఉల్లంఘనలకు కారణాన్ని చూపించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, ఎంసీడీని సుప్రీం కోర్టు కోరింది. భద్రతా నిబంధనలతోపాటు గౌరవ ప్రదమైన జీవితానికి సంబంధించిన ప్రాథమిక నిబంధనలను పూర్తిగా పాటించక పోతే కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు ఆన్‌లైన్‌కు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. దేశం లోని ఏ ఇనిస్టిట్యూట్‌లు భద్రతా నిబంధనలకు లోబడి లేకపోతే వాటిని నిర్వహించడానికి అనుమతించవద్దని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News