Monday, March 31, 2025

ముగ్గురు చిన్నారుల అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

రాత్రి అన్నం తిని పడుకున్న పిల్లలు..నిద్రలోనే
కన్నుమూత అర్ధరాత్రి కడుపు నొప్పితో ఆసుపత్రిలో
చేరి కోలుకుంటున్న తల్లి పిల్లలు తిన్న అన్నంలో
విషం కలిపింది ఎవరు? అమీన్‌పూర్‌లో
అంతుచిక్కని ఘటన

మన తెలంగాణ/అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలో ముగ్గురు చి న్నారులు అనుమానాస్పద స్ఠితిలో మృతి చెందా రు.అయితే, చిన్నారుల మృతిపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. తల్లి, తన ముగ్గురు పిల్లలతో సహా సామూహిక ఆత్మహత్యకు పాల్పడిం దా? లేక ఈ నలుగురిపై హత్యాయత్నం జరిగిందా? అన్న అనుమానాలు కలుతున్నాయి. శుక్రవారం తెల్లావారు జామున జరిగిన ఈ సం ఘటనలో పోలీసుల ప్రాథమిక విచారణలో తల్లి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో అవురిజింతల చెన్నయ్య భార్య రజిత అలియాస్ లావణ్య, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. చెన్నయ్య స్వస్థలం రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, మెడకపల్లి గ్రామం. అమీన్‌పూర్‌కు వచ్చి వాటర్ ట్యాంకర్ నడుపుకుంటూ కటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. గురువారం రాత్రి చెన్నయ్య పిల్లలైన సాయికృష్ణ (12), మధుప్రియ (10), గౌతమ్ (8), భార్యతో కలిసి భోజనం చేశాడు. భార్య, పిల్లలు పెరుగు అన్నం తిన్నారని తాను మాత్రం పప్పుతో తిని చందానగర్‌కు వాటర్ ట్యాంకర్ తీసుకొని వెళ్లినట్లు చెన్నయ్య తెలిపాడు. పని ముగించుకొని రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగొచ్చి పడుకున్నానని చెప్పాడు.

అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన భార్యకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చిందని, వెంటనే పొరుగు వారి సహకారంతో భీరంగూడలోని హాస్పిటల్‌కు తరలించానని పోలీసులకు తెలిపాడు. అనంతరం పిల్లలను పరిశీలించగా వారు విగత జీవులుగా పడి ఉన్నారని, లేపి చూడగా అప్పటికే చనిపోయారని చెప్పాడు. వెంటనే అమీన్‌పూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ నరేశ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. జిల్లా ఎస్‌పి పరితోష్ పంకజ్, డిఎస్‌పి రవీందర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్ టీంను రప్పించి పలు ఆధారాలను సేకరించారు. అనుమానాస్పద మరణాలుగా కేసును నమోదు చేశామని, చిన్నారుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించిన తరువాతు మరణాలకు గల కారణాలు తెలుస్తాయని ఎస్‌పి పేర్కొన్నారు. లావణ్య ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆమె వద్ద నుంచి కూడా పలు వివరాలు తీసుకున్నామని చెప్పారు. విష ప్రయోగం జరిగినట్లు కనిపిస్తోందని, అన్ని కోణాల్లో విచారణ చేసి స్పష్టమైన వివరాలు తెలియజేస్తామని అన్నారు.

మరణాలపై అనుమానాలెన్నో.. :
ఇదిలా ఉండగా చిన్నారుల మరణాలపై ఎన్నో రకాల అనుమానాలు వస్తున్నాయి. పెరుగన్నం తిన్నారని చెబుతున్న చెన్నయ్య తాను ఇంట్లో లేనప్పుడే ఈ ఘోరం జరగడం వెనుక ఆంతర్యాన్ని ఛేదించే పనిలో పోలీసులు ఉన్నారు. అంతేగాక చెన్నయ్య, ఆయన భార్య లావణ్య ఈమధ్య కాలంలో తరుచూ గొడవ పడుతున్నారని లావణ్య తల్లి భారతమ్మ తెలిపారు. చెన్నయ్య మొదటి భార్య చనిపోవడంతో లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడని, కొన్ని రోజుల క్రితం లావణ్య పేరుపై కొంత భూమి కూడా రిజిస్ట్రర్ చేశాడని చెప్పారు. గతంలో రెండు, మూడుసార్లు గొడవలు జరిగినప్పడు పిల్లలను చంపి తానూ చనిపోతానని లావణ్య తన భర్తను బెదిరించినట్లు అక్కడున్న బంధువులు చర్చించుకోవడం కనిపించింది. ఒకవేళ లావణ్యనే పిల్లలకు విషమిచ్చి తాను కూడా చనిపోవడానికి ప్రయత్నించిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు చెన్నయ్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా చిన్నారుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తే మరణాలకు గల కారణం తెలుస్తుందని, దాంతో ఓ క్లారిటీ వస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News