డమాస్కస్ : సిరియా భద్రత దళాలు, పదవీచ్యుత అధ్యక్షుడు బషర్ అసద్ మద్దతుదారులకు మధ్య రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలు తార స్థాయికి చేరుకున్నాయి. ప్రతీకార హత్యల్లో వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 14 సంవత్సరాల క్రితం మొదలైన సిరియా ఘర్షణల్లో ఇంత భారీ స్థాయిలో హింస చెలరేగడం ఇదే ప్రథమం. ఈ ఘర్షణల్లో 745 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు బ్రిటన్కు చెందిన ‘సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్’ వెల్లడించింది. వారిలో ఎక్కువ మంది కాల్పుల్లో మరణించినట్లు సంస్థ తెలియజేసింది.
125 మంది ప్రభుత్వ భద్రత బలగాల సభ్యులు, అసద్ అనుబంధ సాయుధ గ్రూపులకు చెందిన 148 మంది ఉగ్రవాదులు మరణించినట్లు సంస్థ తెలిపింది. లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాల్లో విద్యుత్తు, తాగునీరు నిలచిపోయినట్లు సంస్థ తెలియజేసింది. అసద్ను అధికారం నుంచి తొలగించిన మూడు మాసాల తరువాత గురువారం ఈ ఘర్షణలు మొదలయ్యాయి. కొత్త ప్రభుత్వానికి ఇది సవాల్గా మారింది. అసద్ దళాలను తిప్పికొడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ దారుణ హింసకు ‘వ్యక్తిగత చర్యలే’ కారణమని ప్రభుత్వం ఆరోపించింది.