Monday, July 1, 2024

నేడు టి20 ప్రపంచకప్ ఫైనల్.. కప్పు కొట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

బార్బడోస్: అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. వెస్టిండీస్, యుఎస్‌ఎలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టి20 ప్రపంచకప్ సమరం తుదిం అంకానికి చేరుకుంది. శనివారం భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వరల్డ్‌కప్ ఫైనల్ పోరు జరగనుంది. భారత్ రెండోసారి టి20 వరల్డ్‌కప్ నెగ్గాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది. మరోవైపు సౌతాఫ్రికా తన క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ప్రపంచకప్ సమరంలో ఫైనల్‌కు చేరుకుంది.

తొలి ప్రయత్నంలోనే ట్రోఫీని గెలిచి చరిత్ర సృష్టించాలని సౌతాఫ్రికా భావిస్తోంది. మరోవైపు భారత్ తన ఖాతాలో రెండో టి20 వరల్డ్‌కప్‌ను జతచేసుకోవాలనే లక్షంతో ఉంది. కాగా, ఈ వరల్డ్‌కప్‌లో ఇటు టీమిండియా అటు దక్షిణాఫ్రికాలు అసాధారణ ఆటతో అలరించాయి. ఇరు జట్లు ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకుండానే ఫైనల్‌కు చేరుకున్నాయి. పొట్టి కప్ చరిత్రలోనే ఫైనలిస్టులు ఒక్క మ్యాచ్‌లో కూడా పరాజయం చవిచూడకుండా తుది పోరుకు చేరుకోవడం ఇదే మొదటిసారి.

ఫుల్ జోష్‌లో..
ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా అసాధారణ ఆటతో అలరించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో అలవోక విజయం సాధించింది. పటిష్టమైన జట్టుతో జరిగిన పోరులో టీమిండియా ఎలాంటి ప్రతిఘటన లేకుండానే విజయాన్ని అందుకుంది. దీంతో సఫారీ టీమ్‌తో జరిగే తుది పోరుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో రోహిత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. వరుసగా రెండు మ్యాచుల్లోనూ అర్ధ సెంచరీలతో అలరించాడు. సౌతాఫ్రికాపై కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. అయితే సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి వైఫల్యం జట్టును వెంటాడుతోంది.

ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లి పూర్తిగా నిరాశ పరిచాడు. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా తన బ్యాట్‌కు పనిచెబుతాడా లేదా అనేది సందేహంగా మారింది. కోహ్లి వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లిపై జట్టుకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విరాట్ మాత్రం ఒక్క మ్యాచ్‌లోనూ జట్టుకు అండగా నిలువలేక పోయాడు. ఫైనల్లోనైనా అతను తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక సూర్యకుమార్ యాదవ్ జోరుమీదుండడం జట్టుకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. సూర్యకుమార్ కిందటి మ్యాచ్‌లోనూ నిలకడైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఈసారి కూడా జట్టుకు కీలకంగా మారాడు. శివమ్ దూబె, జడేజా, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక బౌలింగ్‌లో కూడా టీమిండియా సమతూకంగా ఉన్న సంగతి తెలిసిందే. కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

భారీ అంచనాలతో..
మరోవైపు సౌతాఫ్రికా టీమ్ కూడా భారీ అంచనాలతో ఫైనల్‌కు సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ సౌతాఫ్రికా సమష్టిగా రాణిస్తూ విజయాలను సొంతం చేసుకుంటుంది. ఈసారి కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలనే పట్టుదలతో ఉంది. డికాక్, హెండ్రిక్స్, కెప్టెన్ మార్‌క్రమ్, క్లాసెన్, మిల్లర్, మార్కొ జాన్‌సెన్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక షంసి, నోర్జే, రబడా, మహారాజ్, జాన్‌సెన్‌లతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో సౌతాఫ్రికా కూడా విజయమే లక్షంగా పోరుకు సిద్ధమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News