న్యూఢిల్లీ : భారత్ తన టారిఫ్ల తగ్గింపునకు అంగీకరించిందన్న యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనపై పార్లమెంట్ను విశ్వాసంలోకి తీసుకోవలసిందిగా ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ శనివారం విజ్ఞప్తి చేసింది. భారతీయ రైతులు, ఉత్పత్తిదారుల ప్రయోజనాలపై రాజీ పడుతున్నారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ‘వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికన్లతో వాణిజ్య చర్చలకు వాషింగ్టన్ డిసిలో ఉన్నారు. ఈ లోగా అధ్యక్షుడు ట్రంప్ ఈ మాట అన్నారు’ అని రమేష్ ‘ఎక్స్’ పోస్ట్లో పేర్కొన్నారు.
వాణిజ్య టారిఫ్లపై యుఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్న వీడియోను రమేష్ ఆ పోస్ట్కు జత చేశారు. భారత్ తన టారిఫ్ల కోతకు ఒప్పుకున్నదని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ అమెరికాపై భారీగా టారిఫ్లు వేస్తుండడంతో అక్కడ తమ ఉత్పత్తుల అమ్మకం కష్టసాధ్యం అవుతోందన్న తన వాదనను ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘మోడీ ప్రభుత్వం దేనికి అంగీకరించింది? భారతీయ రైతులు, ఉత్పత్తిదారుల ప్రయోజనాలపై రాజీ పడుతున్నారా? పార్లమెంట్ ఈ నెల 10న తిరిగి మొదలైనప్పుడు ప్రధాని ఆ విషయమై పార్లమెంట్లో ప్రకటన చేయాలి’ అని రమేష్ అన్నారు.