లక్ష్యానికి మించి రెట్టింపు ప్యాక్ల అమ్మకాలు
ఎంపి జోగినపల్లి పిలుపుతో రైతులకు అండగా నిలిచిన ‘వాక్ ఫర్ వాటర్’ సంస్థ
తక్కువ ధరలోనే వినియోగదారులకు చేరిన విటమిన్ సి అధికంగా ఉండే బత్తాయిలు
మన తెలంగాణ/హైదరాబాద్ : మంచి ఆలోచనతో చేపట్టిన తెలంగాణ బిగ్ బత్తాయి ఫెస్టివల్ (బత్తాయి డే) విజయవంతమైంది.
రాజ్యసభ సభ్యులు – జోగినపల్లి సంతోష్ పిలుపు మేరకు -వాక్ ఫర్ వాటర్ సంస్థ ఆదివారం నిర్వహించిన బత్తాయి డే లో 2020 ప్యాక్లు అమ్మాలని లక్షంగా పెట్టుకుంటే అంతకు మించి రెట్టింపు స్థాయిలో బత్తాయిలు విక్రయించినట్లు నిర్వాహకుడు కరుణాకర్ రెడ్డి తెలిపారు. అత్యంత క్లిష్ట సమయంలో బత్తాయి రైతులకు రేటు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో బత్తా యి డే తో చాలా మందికి మేలు జరిగిందని పేర్కొన్నారు. 20 కిలోల బత్తాయిని కేవలం రూ.500లకు వినియోగదారులకు అందించాగలగామని తెలిపారు.
ఇటు ప్రభుత్వ ఆశయం నేరవేరడంతో పాటు అటు వినియోగదారులకు తక్కువ ధరలో విటమిన్ సి అధికంగా ఉండే బత్తాయి పండ్లను అందించినట్లు వివరించారు. లక్ష్యానికి మించి ఆర్డర్లు రావడంతో మరింతగా రైతుల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నిర్వహించిన బత్తాయి డేకు ప్రజాప్రతినిధుల నుంచి కూడా విశేష స్పందన లభించింది. ఎంపి సంతోష్ పిలుపు మేరకు ఎంఎల్ఎ నడిపల్లి దివాకర్రావు,టిఆర్ఎస్ యువ నాయకులు విజిత్రావులు 300 మందికి ఉచితంగా బత్తాయిలు పంపిణీ చేశారు. అలాగే చొప్పదండి ఎంఎల్ఎ సుంకె రవి శంకర్ కూడా బత్తాయిలను పంపిణీ చేశారు.బత్తాయి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
డాక్టర్లు.. పోలీసులతో పాటు రైతులు
కరోనా కట్టడిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసుల సేవలను కొనియాడుతున్నామని అదే సమయంలో రైతుల కష్టం కూడా మరవలేనిదని ఎంపి సంతోష్ చొరవతో వాక్ ఫర్ వాటర్ సంస్థ నిర్వాహకుడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టన్నుల బత్తాయి అమ్ముడుపోకుండా ఉన్న సమయంలో అన్నదాతలను ఆదుకుని వారి చిరునవ్వులకు కారణమయ్యారని, అదే సమయంలో వినియోగదారులకు బత్తాయిని అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రశంసలు వస్తున్నాయి.