Sunday, July 7, 2024

మంత్రివర్గ విస్తరణ వాయిదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ ఎప్పుడైనా ఉంటుందని అనుకున్నారు. రేవంత్ రెడ్డి గవర్నర్ ను కూడా కలవడంతో రాజ్ భవన్ లో ఏర్పాట్లు జరరగమే తరువాయని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ మారిపోయింది. ఇప్పుడల్లా మంత్రి వర్గ విస్తరణ లేదని కొత్త మంత్రులెవరూ ప్రమాణం చేయడం లేదని చెబుతున్నారు. దీనికి కారణం హైకమాండ్ నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. మంత్రి వర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ ఎంపికపై పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం పాలనపై దృష్టి పెట్టాలని పూర్తి స్థాయి బడ్జెట్ పై కసరత్తు చేసి హామీల అమలు దిశగా కృషి చేయాలని హైకమాండ్ రేవంత్ కు చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్నాయి. ఇందులో నాలుగైదు స్థానాలను భర్తీ చేయాలని రేవంత్ అనుకుంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు.

ఆయా జిల్లాలతో పాటు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్న మరికొంత మంది సీనియర్లకు పదవులు ఇవ్వాలనుకున్నారు. కానీ వారికి ఇస్తే సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు సరిపోవడం లేదు. దీంతో ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ విషయాన్ని పక్కన పెట్టడం మంచిదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడే పార్టీలో చేరికల అంశం గందరగోళానికి కారణం అవుతోంది. పార్టీలో చేరుతున్న బీఆర్‌ఎస్ నేతల వల్ల ఇప్పటికే ఉన్న క్యాడర్ డిస్ట్రబ్ అవుతోంది. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ చేస్తే పదవులు రాని వారి వల్ల మరింతగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొదట్లోనే అన్ని పదవలు భర్తీ చేసి ఉంటే ఈ పాటికి అతా సర్దుకునేది. కానీ లోక్ సభ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచిన వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని సంకేతాలు పంపడం కోసం వాటిని ఖాళీగా ఉంచారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో అనుకున్నంతగా ఫలితాలు రాలేదు. పదమూడు స్థానాలు వస్తాయనుకుంటే ఎనిమిది స్థానాలకే పరిమితమయ్యారు.

తనకు అప్పగించిన టాస్క్ పూర్తి చేశానని తనకు మంత్రి పదవి కావాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు ఇప్పటికే ఆయన సోదరుడు మంత్రిగా ఉన్నారు. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి ఇవ్వాలన్నా సాధ్యం కావడం లేదు. ఒక్కో నేత ఒక్కో పేరును సూచించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే గతంలో ప్రకటించిన నామినేటెడ్ పోస్టులకు కూడా ఇంకా జీవో జారీ చేయలేదు. హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేసుకునే నేతుల కూడా ఎక్కుగా ఉన్నారు.

పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ…

పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం ఆశావహులు అందరూ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీఎం పదవి ఇవ్వడంతో బీసీ నేతకు పిసిసి చీఫ్ పదవి వరించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పిసిసి చీఫ్ రేసులో మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మధుయాష్కీకి రాహుల్ గాంధీ అండదండలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ కుమార్ గౌడ్ స్వయంగా ఎదిగారని, ఆయనపై హైకమాండ్‌కు సాప్ట్ కార్నర్ ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్త విస్తరణపై హైకమాండ్ పెద్దలకు వివరించేందుకు మరోసారి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. నలుగురికి బెర్త్ కన్ఫామ్ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ నలుగురు ఎవరనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,

హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేర్లు వినిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. వీరిలో ముగ్గురికి బెర్త్ కన్ఫామ్ అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే సీతక్క మంత్రి పదవి మారనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెకు ప్రమోషన్ ఇచ్చి హోం మంత్రి పదవి అప్పగించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఎవరికి కేటాయించలేదనే విషయం తెలిసిందే.

పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా…

తెలంగాణ కొత్త అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పడింది. పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసీసీ వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు. పీసీసీ పదవి కోసం మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క కూడా ఈ పదవి కోసం అధిష్ఠానం వద్ద అడుగుతున్నారని సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News