Thursday, September 19, 2024

కర్నాటక వాల్మీకి స్కామ్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌కు లింకులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటకలో వాల్మీకి స్కామ్ తీగ లాగితే డొంకంతా తెలంగాణ కాంగ్రెస్ నేతల వైపు కదులుతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణలోని కీలకమైన కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభిస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. వాల్మీకీ స్కామ్‌లో భారీగా అవినీతి జరిగిందంటూ స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యనే అసెంబ్లీలో అంగీకరించటంతో ఈ మొత్తం స్కాంలో ఉన్న అందరినీ పేర్లు బయటకు రావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ వేదికగా కెటిఆర్ ఈ అంశంపై పలు ప్రశ్నలను సంధించారు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికలకు ముందు దాదాపు రూ. 180 కోట్లు ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వ అకౌంట్ల నుంచి ఏ కారణం లేకుండా అక్రమంగా దారి మళ్లిందని ఆరోపించారుర. ఈ సొమ్ము అంతా ఎవరికీ ఖాతాలోకి బదిలీ అయిందో ప్రజలకు తెలియాలని అన్నారు. అందులో రూ. 45 కోట్లు హైదరాబాద్‌లోని 9 బ్యాంకు ఖతాలకు బదిలీ చేశారు..? ఆ బ్యాంక్ ఖాతాలు ఎవరివో తేల్చాలి అని కోరారు.

ఈ వ్యవహారం బయటకు రాగానే వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరిండెంట్ సూసైడ్ చేసుకోవటం మరింత అనుమానాలకు తావిస్తోందన్నారు. వి6 పేరుతో ఉన్న బిజినెస్ సంస్థకు రూ. 4.5 కోట్లు బదిలీ చేసినట్లు వార్తలు వస్తున్నాయని, అసలు ఆ సంస్థ యాజమాని ఎవరో ప్రజల ముందుంచాలని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ డబ్బే తమ ఎన్నికల కోసం వాడినట్లుందని అనుమానం వ్యక్తం చేశారు. వాల్మీకి స్కామ్ వ్యవహారంలో హైదరాబాద్‌లో సిట్, సిఐడి, ఇడిలు దాడులు నిర్వహించినప్పటికీ ఆ సమాచారం మీడియాలో రాకుండా అడ్డుకున్నది ఎవరు..? కెటిఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సహా కీలకమైన కాంగ్రెస్ నేతలు కొంతమంది మీడియాను మేనేజ్ చేసినప్పటికీ మరో నాలుగైదురోజుల్లో అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొన్ని బార్లు, బంగారు దుకాణాల నుంచి భారీగా నగదు విత్ డ్రా చేసినట్లు సమాచారం ఉందని, ఆ బార్లు, బంగారం దుకాణాలను నడుపుతున్నెదవరు..? అని… వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధం ఏమిటి..? అని ప్రశ్నించారు.

ఇడి ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలి
కర్ణాటక సిఎం సిద్దిరామయ్యను తొలగిస్తే…తెలంగాణ ప్రభుత్వం కూడా కూలిపోతుందని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అనటం వెనుక అంతర్యం ఏమిటి..? అని కెటిఆర్ నిలదీశారు. అంటే కర్ణాటక కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య పెనవేసుకున్న బంధం ఈ వాల్మీకి స్కామేనా..? అని ప్రశ్నించారు. ఈ స్కామ్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతలున్నట్లు పెద్ద ఎత్తున ఆధారాలు కనబడుతున్నప్పటికీ ఇడి ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడి నేతలు కాపాడుతున్న శక్తులెవరో ప్రజల ముందుంచాలన్నారు. పార్లమెంట్‌లో అవినీతిపై పెద్ద ఎత్తున మాట్లాడే రాహుల్ గాంధీ…ఈ వాల్మీకి స్కామ్ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. అంటే సొంత పార్టీ నేతలు అవినీతి చేస్తే మాఫీయేనా అని విమర్శించారు. వెంటనే రాహుల్ గాంధీ ఈ విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు. మొత్తం వ్యవహారంలో ఉన్న పెద్ద చేపల పేర్లు బయటకు రావాల్సిన అవసరముందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News