టోక్యో: జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సిన ప్రగతి సాధించామని అన్నారు. రాష్ట్రంలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ని పరిశీలించామని అన్న రేవంత్ మూసీ ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు.
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి కీలకమని సిఎం పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు పెరగాలి అని అన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం అని తెలిపారు. ‘తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని అన్నారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు’ అని జపాన్లో స్థిరపడ్డ తెలుగువారిని ఉద్దేశించి సిఎం ప్రసంగించారు.