మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులు బకాయిల కో సం తిరగాల్సిన పనిలేదని, ఇప్పటికే పదివేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను క్లియర్ చేశామని, మిగిలిన పెం డింగ్ బిల్లులను త్వరితగతిని చెల్లిస్తామని ఉద్యోగుల జేఏసి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీనిచ్చా రు. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏ సి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ దశాబ్దాలుగా పనిచేసిన ఉద్యోగులు దాచుకున్న డబ్బు కోసం పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను అర్థం చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఐదు వేల కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టిందని, వాటిని క్లియర్ చేసే క్రమంలో ఈ 14 నెలల కాలంలో కొంత బకాయిలు జమ అయ్యాయని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వివరించారు.
పాత, కొత్త పెండింగ్ బిల్లులు కలిపి రూ.10 వేల కోట్లను తమ ప్రభుత్వం క్లియర్ చేసిందని ఆయన తెలిపారు. మరో ఎనిమిది వేల కోట్ల బకాయిలు మిగిలి ఉన్నాయని ఆయన వివరించారు. వచ్చేనెల ఏప్రిల్ నుంచి ప్రాధాన్యత క్రమంలో ప్రతినెలా రూ.500 నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను క్లియర్ చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హామీనిచ్చారు. పది సంవత్సరాలు పరిపాలించిన వారి సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నెలలో ఏ తేదీలో జీతాలు పడతాయో అర్థం కాని పరిస్థితి ఉండేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా క్రమం తప్పకుండా ఒకటో తేదీన జీతాలను చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది (ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్) సిబ్బంది ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ తదితర బిల్లును మాత్రమే పెండింగ్లో ఉన్నాయని ఆయన తెలిపారు. వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అర్ధికేతర సమస్యలు పరిష్కరించడానికి వివిధ కేబినెట్ సభ్యులు ఉన్నారని ఆ సమస్యలు కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఆయన వివరించారు. తమది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, టిజిఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టిజిఓ నాయకులు శ్యాం, రాష్ట్ర ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షుడు కె. నిరంజన్ రావు, రాష్ట్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్, గెజిటెడ్, వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు, మున్సిపల్, వైద్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.