హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సియూ)లోని కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ భూములపై ఏప్రిల్ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వ భూములేనని ఆ అఫిడవిట్లో ప్రభుత్వం క్లియర్ కట్గా స్పష్టం చేసింది. ఈ భూముల్లోనే సెంట్రల్ యూనివర్శిటీ, మరికొన్ని ఇనిస్టిట్యూట్లు, బస్స్టాండులు, తదితర సౌకర్యాలు ఎన్నో వచ్చాయని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సోదాహరణగా వెల్లడించింది. సుమారు 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచి, అటవీ ప్రాంతంగా మారిందని సదరు అఫిడవిట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం వివాదాస్పదం కావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి సీనియర్ న్యాయవాదలతో చర్చించి ఈ అఫిడవిట్ను సిద్దం చేశారు
సోమవారం దీనిని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. మరోవైపు ఉచిత పథకాల కారణంగా ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలిలోని దాదాపు 400 ఎకరాలు వేలం పాట నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థలంలో జెసిబిల సాయంతో చెట్లను సైతం నరికి వేయించింది. ఈ విషయం తెలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనలు, ధర్నాలకు దిగారు. వీరి ఆందోళన తీవ్ర తరం చేయడంతో ప్రతిపక్షాలు బిఆర్ఎస్, బిజెపి సైతం వారికి మద్దతు ప్రకటించాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ప్రతిపక్షాలు ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. కంచ గచ్చిబౌలిలో చెట్లు నరకవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ వ్యవహారంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇంకోవైపు ఈ భూములపై రేవంత్ రెడ్డి సర్కార్ ఓ లేఖ విడుదల చేసింది. 2003లో ఈ భూములను నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం ఐఎంజి సంస్థకు విక్రయించిందని తెలిపింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసిందని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ భూములు ప్రభుత్వానికి కేటాయించడంతో అందుకు ప్రతిగా ప్రభుత్వం మరో చోట వందలాది ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిందని ఆ లేఖలో ప్రభుత్వం సోదాహరణగా వివరించిన సంగతి విదితమే.