Tuesday, April 15, 2025

సన్న బియ్యంతో 3.10 కోట్ల మందికి లబ్ధి:భట్టి విక్రమార్క

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన సన్న బియ్యం పథకం కింద అమలుకు ఏడాదికి రూ.13,525 కోట్లు వెచ్చిస్తున్నామని, దీనివల్ల 3.10 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఖమ్మం జిల్లా, మధిర మండలం, మధిర మున్సిపాలిటీలో వందల కోట్ల అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేసిన తదుపరి తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత పాలకులకు ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్లపాటు సన్న బియ్యం సంగీతం పాడారు తప్ప గింజ కూడా పంపిణీ చేయలేదని ఆరోపించారు. పేద వర్గాలకు సన్న బియ్యం పంపిణీ దేశంలో ఎక్కడా జరగడం లేదు అన్నారు. సన్న బియ్యంతో తినాలని ఆశగా ఎదురుచూసే రాష్ట్రంలోని 90 లక్షల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు, 2.85 కోట్ల మంది లబ్ధిదారులకు ఈ ఏడాది ఉగాది నుంచి పంపిణీ చేస్తున్నామని వివరించారు. సన్నధాన్యం బోనస్‌కు రూ.2,675 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తున్నారని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయని అన్నారు. గత పాలకులు రూ.8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పగిస్తే వాటన్నిటినీ సరి చేసుకుంటూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో తమ ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయడం లేదని అన్నారు. ఇవేకాకుండా కొత్తగా రాబోతున్న రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో కోటి రేషన్ మంది కార్డుదారులకు, 3.10 కోట్ల మంది లబ్ధిదారులకు సన్న బియ్యం అందించే కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. నిరుపేదలకు సన్న బియ్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 13,525 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని ఈ పథకం తెలియజేస్తుందని అన్నారు.

కనీవినీ ఎరుగని గొప్ప కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని తెలిపారు. ప్రజలకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేయడమే కాదు.. సన్నధాన్యం సాగు చేసే రైతులకు మరోవైపు బోనస్ అందించి ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సన్న ధాన్యం సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,675 కోట్లు వెచ్చిస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమాలు చేపడుతూనే మరోవైపు రైతు రుణమాఫీ కోసం రూ.21 వేల కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, సన్నధాన్యం బోనస్‌గా రూ.2,675 కోట్లు, వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలు ఉచిత విద్యుత్ కోసం రూ.12,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. ఇవన్నీ చేపడుతూ తిరిగి పేదలకు సన్న బియ్యం అందించేందుకు 13,525 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక మిగిలిపోయిన నిరుద్యోగుల కోసం రూ.9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పేరిట కొత్త స్వయం ఉపాధి పథకాలను చేపట్టినట్టు తెలిపారు.

రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటన నాటి నుంచి శాంక్షన్ లెటర్ ఇచ్చేవరకు క్యాలెండర్ ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని వివరించారు. వరుస సెలవులు, వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు రాజీవ్ యువ వికాసం గడువును ఈనెల 14 వరకు పెంచామని, మండల, జిల్లాస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ఎప్పటివరకు ముందే ప్రకటించినట్టు తెలిపారు. జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో శాంక్షన్ లెటర్లు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని తెలిపారు. ప్రకటించిన క్యాలెండర్‌ను తూచా తప్పక పాటిస్తామని స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాసం కింద ఎంచుకున్న పథకానికి కనీసం మూడు రోజుల నుంచి వారం రోజులపాటు శిక్షణ కార్యక్రమం, తదుపరి గ్రౌండింగ్ పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్టు వివరించారు. సమావేశంలో వైరా ఎంఎల్‌ఎ రాందాస్ నాయక్, హస్తకళల బోర్డు ఛైర్మన్ నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News