Sunday, September 8, 2024

రూ.2.50లక్షల కోట్లతో పద్దు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : – ఈనెల 25న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా(2024-25) బడ్జెట్‌ను వాస్తవ అంచనాలను మాత్రమే తయారు చేసేలా అధికారులకు ఆదేశా లు జారీ చేసింది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లపై స్పష్టత వచ్చిన తరువాత బ డ్జెట్‌పై పూర్తి స్థాయిలో కసరత్తు జరగనుంది. ప్రస్తుత
ఆర్థిక సంవత్సరం (2024- 25) బడ్జెట్‌ను వాస్తవ అంచనాలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్థిక శాఖకు సూచించింది. ఆదాయ, వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా, ఎంతమేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంతమేరకే కేటాయింపులతో రూపొందించాలని నిర్దేశించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం వంద శాతం వ్యయం చేయలేదు. ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక బడ్జెట్ ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత పదేళ్లలో 2019-20 లో మాత్రమే బడ్జెట్ అంచనాల్లో 97.5 శాతం వ్యయమైందని శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతున్నందున బడ్జెట్ రూ.2.50 లక్షల కోట్ల వరకు చేరే కనిపిస్తున్నాయి. ఈ నెల 25 న శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని అడిగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆమోదించగానే అధికారులు తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున వెంటనే రాష్ట్ర బడ్జెట్‌కు నిధుల కేటాయింపుపై తుదిరూపు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలను కలిపి రూ.60 వేల కోట్లకు పైగానే ఉండవచ్చని ప్రాథమిక అంచనా. రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబడులు రూ2.05 లక్షల కోట్లలో 25 శాతం (రూ.53,196 కోట్లు) ఆరు గ్యారంటీలకు ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించింది.

ఈ కేటాయింపులు గత బడ్జెట్‌లో లేనివి. ప్రస్తుత బడ్జెట్ మొత్తం రూ.2.90 లక్షల కోట్లు ఉండగా అందులో రూ.15 వేల కోట్లకు పైగా తగ్గించి ఓటాన్ ఎకౌంట్‌ను రూ.2.75 లక్షల కోట్లకే రూపొందించారు. రాష్ట్రాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లలో గత పద్దులో పేర్కొన్న మొత్తం కన్నా తగ్గించడం అరుదు. కానీ గత బడ్జెట్‌లో వేసిన అంచనాల మేరకు ఆదాయం రానందువల్ల కొత్త బడ్జెట్‌ను వాస్తవానికి దగ్గరగా రూపొందించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్‌ను రూపొందిస్తే పథకాలకు కేటాయించిన నిధులు పూర్తిగా వ్యయమవుతామని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
గతేడాది వ్యయం రూ.2.11 లక్షల కోట్లు…
ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం (2023-24) రాష్ట్రానికి రూ.2.59 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేసింది. చివరికి రుణాలతో కలిపి రూ.2.18 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. వ్యయం రూ.2.49 లక్షల కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తే రూ.2.11 లక్షల కోట్లే ఖర్చు చేసినట్లు కాగ్ వెల్లడించింది. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.38,234 కోట్ల రుణాలను తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా రూ.49,589 కోట్ల రుణాలను సేకరించింది. ఇలా లక్ష్యానికి మించి రుణాలను సేకరించినా ఆదాయం రూ.2.18 లక్షల కోట్లే ఉందని కాగ్ తన నివేదిక వివరించింది.
కేంద్ర గ్రాంట్లపై స్పష్టత వచ్చిన తర్వాతే…
కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో పెద్దఎత్తున నిధులు వస్తాయనే అంచనాలతో బడ్జెట్ రూపొందించి, చివరికి అవి రాకపోవడంతో వ్యయ లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. 2023-24లో కేంద్రం నుంచి రూ.41,259 కోట్ల గ్రాంట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. చివరికి రూ.9,729.91 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఊహించిన దాంట్లో 23.58శాతం మాత్రమే కేంద్రం కేటాయించింది. కేంద్రం గ్రాంట్లలో 76.42శాతం సొమ్మును ఇవ్వకపోవడంతో రాష్ట్ర ఆదాయం రూ.2.18 లక్షల కోట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో 23న కేంద్ర బడ్జెట్‌ను జాగ్రత్తగా పరిశీలించి, గ్రాంట్లపై స్పష్టమైన అవగాహన వచ్చిన అనంతరం రాష్ట్ర ఆదాయ, వ్యయాల మొత్తాలను రుపొందించాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం సూచనలు చేసింది.

ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం విందు
ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది కి శుక్రవారం సాయంత్రం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కమల్లు ప్రజాభావన్ లో విందు ఏర్పాటు చేశారు. బడ్జెట్ నేపథ్యం లో అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకుండా, సుహృద్భావ వాతావరణంలో పనిచేసుకోవాలన్న ఆలోచన తో విందు ఏర్పాటు చేశారు. బడ్జెట్ కు ముందు అధికారులు సిబ్బంది కి ఆర్థిక శాఖ మంత్రి విందు ఏర్పాటు చేయడం ఆనవాయితీ గా వస్తోంది.. ఆనవాయితీ కొనసాగింపులో భాగంగా శుక్రవారం సిబ్బందికి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా డిప్యూటీ సీఎం సిబ్బంది ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్లి పలుకరించి, యోగ క్షేమాలు విచారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News