Sunday, September 8, 2024

నిరుపేద నెత్తుటి చుక్కలో ఎన్ని విప్లవాలో..!

- Advertisement -
- Advertisement -

రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయంబు అంటూ నిందాస్తుతి చేశాడు మధ్యయుగాలలోని ఓ ప్రబంధ కవి. రాజును, రాజరికాన్ని, రాజ్యంలోని స్థితిగతులను రాజుల ముందు పొగిడి వారి మెప్పు పొందే అవకాశం ఉన్నా, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే ధైర్యం కొది మందికే వుంటుంది. అలాంటి వారిలో మరొక ప్రసిద్ధ కవి బమ్మెర పోతన. నేటి వరంగల్లు నాటి ఓరుగల్లు కేంద్రంగా చేసుకొని పాలించిన కాకతీయుల కాలం నాటి వాడే అయినా రాజులు ఇచ్చే అగ్రహారాలు, వజ్రపు హారాలు వదులుకొని కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఎవరిపరం చేయకుండా సత్కవుల్ హాలికులైననేమి? అంటూ తనకున్న భూమిని సేద్యం చేసుకుంటూ కవితా సేద్యాన్ని చేసి భాగవతం రచించి చిరకీర్తిని పొందారు.

పైన చెప్పినట్లుగా మొదటి వ్యక్తి (ధూర్జటి) రాజుల ఆస్థానంలో ఉంటూ రాజు ద్వారా కల్పించబడిన విలాసాలు, ఉన్నతమైన గౌరవాన్ని పొందినప్పటికీ రాజు నిజ స్వరూపాన్ని నిందిస్తూ చెప్పటం అంటే ఆ కాలంలో గొప్ప విషయం కాకపోతే ఏంటి?ఇక మధ్యయుగాల విషయం పక్కనపెడితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఒకసారి అవలోకిద్దాం. స్వాతంత్య్రానికి పూర్వం దేశాన్ని సంస్థానాధీశులు పరిపాలించారు. అలానే ఎక్కువ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు పాలించారు. వెరసి పాలకులు ఎవరైనా సామాన్య ప్రజానీకంపై పన్నుల భారం మోపడం, ప్రజల్ని హింసించడం, ప్రశ్నిస్తున్న కవులను, కళాకారులను, ఉద్యమకారులను అకారణంగా జైల్లో బంధించి చిత్రహింసలు పెట్టడం లేదా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి భవిష్యత్తులో ఎవరు తమ పాలనను, అధికారాలను ప్రశ్నించకుండా ఉండాలని చీకటి కారాగారాల్లో లేదా బహిరంగంగా ఉరివేసేవారు.

సరిగ్గా అదే లక్షణాలు పుణికిపుచ్చుకున్న రాజు నిజాం. దక్కన్ ప్రాంతాన్ని గోల్కొండ కేంద్రంగా పాలన సాగిస్తూ ఆనాడు చేసిన అరాచకాలు, దురాగతాలు అన్ని ఇన్ని కావు. అలాంటి వారిని ప్రశ్నించడం అన్నా, వారి పాలనకు వ్యతిరేకంగా గొంతు వినిపించటం అన్నా ప్రాణాలను తెగిస్తేనే తప్ప ఇంకొకటి సాధ్యం కాదు. అలాంటి కోవకు చెందినవారే దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం ఉక్కు పిడికిట్లో బందీ అయిన తెలంగాణ సమాజాన్ని, తనతోటి ప్రజల ఆర్తనాదాన్ని, ఆకలి కేకలను, స్వయంగా చూసి చలించి ఉక్కు పిడికిలి బిగించి జంగ్ సైరన్ ఊదాడు.

నిజాం రాజు తనను నిజామాబాద్ జైలులో బందిస్తే జైలు గోడలపై బొగ్గుతో నిజాంకు వ్యతిరేకంగా ఓ నిజాం పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకేన్నడేని అంటూ నిరసన గళం వినిపించి విప్లవ శంఖం ఊదినాడు. అలాంటి ధిక్కార, తిరుగుబాటు కవి రచించిన అగ్నిధార కవితా ఖండికలోని కొన్ని సాహిత్య విషయాలు మరికొన్ని చారిత్రక వాస్తవాలు తెల్పుకుందాం.

ఇది నిదాఘము; ఇందు సహింపరాని /వేడి యేడ్పించుచున్నది; పాడువడిన /గోడలందున జైలులో పాడినాడ /వాడిపోనున్న పూమొగ్గపైన పాట;/ ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా జ్యము లున్నవో! యని యరసినాను; /నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని/ విప్లవాలో! యని వెదకినాను;
నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించినందుకు ప్రతీకారంగా ఇందూరు జైలులో (నిజామాబాద్ పూర్వనామం) బందీ చేస్తాడు దాశరథి గారిని, బందీ అయినది శరీరమే కానీ మనస్సు కాదంటూ నిప్పులు చెరిగే కవిత్వాన్ని బొగ్గుతో గోడలపై వ్రాసి నన్ను బంధిస్తే తన గళం ఇంకా పదునెక్కుతుందని గొంతుచించుకొని అరిచాడు. జైలులోని పరిస్థితులను వివరిస్తూ సహింపరాని వేడి ఏడ్పిస్తూ ఉండగా, పాడుబడిన గోడలు, మొత్తుకున్నాను, ఏడ్చాను నా స్వేచ్ఛ కు ఆంక్షలు విధించిన ఓ నిజాం పిశాచమా నన్నే నువ్వు బందీని చేస్తే సామాన్యులు పరిస్థితి ఏమిటి? నిరుపేద వాని నెత్తురు చుక్కలో ఎన్ని విప్లవాలో అని వెదికాను అంటూనే వెన్నెలలు లేవు, పున్నమకన్నే లేదు, పైడి వెన్నెల నెలవంక జాడలేదు,చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి, ధూమదామమ్ము దుఃఖ సంగ్రామ భూమి అంటూ తెలంగాణ ప్రాంతం మొత్తం చీకట్లో ఉన్నట్లుగా, యుద్ధ భూమిని తలపిస్తున్నట్లుగా వుంది అంటూ జైలులోనే నిరసన గళం వినిపించి నిరసన వ్యక్తం చేశాడు.
ఓసి కూలిదానా! అరుణోదయాన /మట్టి తట్ట నెట్టిన బెట్టి మరుగులేని /యెత్తు రొమ్మును పొంగించి యెందు కొరకు / ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ?

పై వాక్యాలు చార్మినార్ పరిసరాలలో రాతి కట్టడాల నిర్మాణ సమయంలో ఓ మహిళా కూలిని చూసి చలించి వాసిన ఉస్సురనెదవు కవితలోని వాక్యాలు అవి. హైదరాబాద్ నగర నిర్మాణంలో పాలమూరు కూలీల శ్రమ వెలకట్టలేనిది. ఇప్పుడు మనకు భౌతికంగా కనిపిస్తున్న అనేక కట్టడాలు వారి శ్రమతో రూపుదిద్దుకొన్నవే. నాకు ఈ కవితను చదవగానే శ్రీశ్రీ దేశ చరిత్రలు కవితలోని నైలునది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది? తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు? అన్న వాక్యాలు గుర్తుకు వచ్చాయి. వాస్తవంగా తాజ్‌మహల్ నిర్మాణం (1632-1653) జరిగింది. కానీ 1590 లోనే చార్మినార్ నిర్మాణం జరిగిందనేది చరిత్ర చెప్పిన సత్యమే.

అలానే దీని నిర్మాణంలో కూడా పాలమూరు కూలీల శ్రమ దాగి వుందనేది కాదనలేని వాస్తవం. ఇక్కడ దీనికి సంబంధించిన విషయం మరొకటి ప్రస్తావించాలి. అలిశెట్టి ప్రభాకర్ వలస కూలీలను ఉద్దేశించి నాలుగు మాటల్లోనే గొప్ప అర్థం దాగి ఉండేలా పార్లమెంట్ భవనమైన పాలరాతి బొమ్మైన వాడు కడితేనే ఆకారం, వాడు చుడితేనే శ్రీకారం అంటాడు. దీనిని బట్టి వలస కార్మికుల నైపుణ్యం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.

అనాదిగా సాగుతోంది / అనంత సంగ్రామం /అనాథుడికి, ఆగర్భ /శ్రీనాథుడికీ మధ్య. /సేద్యం చేసే రైతుకు/
భూమి లేదు, పుట్రలేదు /రైతుల రక్తం త్రాగే /జమీందార్ల కేస్టేట్లు/ అనంత సంగ్రామం శీర్షికతో ఉన్న కవితలోని వాక్యాలు అవి. యుద్ధం ఇంకా మిగిలే ఉంది అన్నట్లుగా ఆదిమ కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకూ అనేక సంఘర్షణలకు పరిష్కారం లభించట్లేదు. పెద్ద చేప చిన్నచేపను మింగుతున్నట్లుగా, ఉన్నవాడు లేనివాడిని దోచుకుంటే, కర్షకుడికి భూమి లేకుండా, విలాసంగా గడిపేవారికి వందల ఎకరాలు (ఎస్టేట్లు) ఉంటే తప్పకుండా సంగ్రామం లేదా సంఘర్షణ మొదలైతది ఇది చరిత్ర చెప్పిన వాస్తవిక రూపమే. ఇదే మాట ఇదే మాట/ పదే పదే అనేస్తాను /కదం తొక్కి పదం పాడి /ఇదే మాట అనేస్తాను./ దగాకోరు బటాచోరు/ రజాకారు పోషకుడవు. /వూళ్ళ కూళ్ళు అగ్గిపెట్టి /ఇళ్ళన్నీ కొల్లగొట్టి /తల్లి పిల్ల కడుపుకొట్టి /నిక్కిన దుర్మార్గమంత /దిగిపోవోయ్ తెగిపోవోయ్ /తెగిపోవోయ్ దిగిపోవోయ్ /ఇదే మాట ఇదే మాట /పదే పదే అనేస్తాను.
అగ్నిధార కావ్యంలోని చివరి కవిత ఇది. పదే పదే అనేస్తాను శీర్షికతో ఉన్న కవితలోనివి పై వాక్యాలు అవి. ఈ కవితను చదివితే శ్రీశ్రీ జగన్నాథుని రథచక్రాలు కవిత గుర్తుకు వచ్చింది.

లయబద్ధంగా అలానే ఉన్నట్లనిపించింది. చరిత్రలో నియంతలు హిట్లర్, ముస్సోలిని, ఘజనీలు, ఘోరీలు, ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు నువ్వేంత నీకుపోయే కాలం వచ్చింది.అందుకే ఈ మాట పదే పదే అనేస్తాను. ఇక చాలు నీ అసమర్ధ పాలన అంటూ కడిగిపారేశారు ఈ కవితలో. కవి ఎప్పుడు పాలకపక్షం కాకుండా ప్రజల పక్షం నిలబడాలి, అన్నార్తుల వైపు, అనాథల వైపు, ఆకలి కేకల వైపు నిలబడాలి. పాలకులు ఎరగా వేసే పదవులకు, తాయిలాలకు ఆశపడకుండా నిఖార్సయిన, నిష్కల్మషమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలనేది నా అభిప్రాయం.

శ్రీశ్రీ, దాశరథి ఇద్దరు సమకాలికులే అయినప్పటికీ వీరి కవిత్వమే వీరిద్దరినీ పతాక స్థాయికి చేర్చింది. అందుకు ఉదాహరణే తిమిరంతో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావటం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూనే కోట్ల మంది వైపు నిలబడి నిజాం నిరంకుశత్వాన్ని ప్రశ్నించిన ధీరుడు దాశరథి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఊరు ఊరునా వాడవాడలా అగ్నిధార కావ్యంలోని వాక్యాలు తెలంగాణ సమాజంలోని ప్రతి గొంతుకను పిడికిలెత్తి అరిచేలా చేసింది. స్వరాష్ట్రం సిద్ధించాక దాశరథి పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఏటా లబ్ధప్రతిష్టులకు అవార్డులు ఇచ్చి సన్మానించి దాశరథి కీర్తిని దశదిశలా వ్యాపింపజేస్తోంది ప్రభుత్వం అధికారికంగా.

డా. మహ్మద్ హసన్
99080 59234

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News