హైదరాబాద్ : గతనెల 26న అదృశ్యమైన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రోహిత ఆచూకీ కోసం గచ్చిబౌలి పోలీసుల బృందాలు చెన్నై, బెంగళూరులో ముమ్మరంగా గాలిస్తున్నారు. చాదర్ ఘాట్ ప్రాంతానికి చెందిన రోహిత నానక్రాంగూడలోని ఆపిల్ఇండియా ప్రైవేట్లిమిటెడ్కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు దూరంగా ఉంటూ నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని సెలెప్టియా అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో గత డిసెంబర్26న మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి ఇంతవరకు రాలేదు. ఆమె సెల్ ఫోన్ సైతం స్విచ్చాఫ్చేసి ఉండటంతో డిసెంబర్ 29న ఆమె సోదరుడు పరిక్షిత్ గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో తన సోదరి రోహిత కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కాగా ఐడి కార్డుతో పాటు ల్యాప్టాప్ను ఫ్లాట్లోనే వదిలి వెళ్లినట్లు ఆమె సోదరుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కాగా ఆదివారం ఆమె సికింద్రాబాద్, రిజిమెంటర్ల బజార్ ప్రాంతంలో కనిపించినట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ముమ్మరంగా గాలింపు చేపట్టారు. గాలింపులో భాగంగా సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సురేందర్రెడ్డి సికింద్రాబాద్లోని ప్రాంతాల్లో సిసి పుటేజీలు పరిశీలించినప్పటికీ రోహిత ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రోహిత బెంగళూరులోని తన స్నేహితుల వద్ద ఉంటోందన్న సమాచారం అందుకున్న పోలీసుల బృందాలు కర్ణాటకకు బయలు దేరాయి. మరి కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు నలుగురు పోలీసుల బృందం చెన్నై వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రోహిత కుటుంబ సభ్యుల, తోటి ఉద్యోగులను కలిసి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.