Sunday, September 8, 2024

నెవాడా ఎడారిలో జనం జీవన్మరణ స్థితి

- Advertisement -
- Advertisement -

నెవాడా ఎడారి : అమెరికాలోని నెవాడా ఎడారిలో బర్నింగ్ ఫెస్టివల్ ప్రాంతంలో బురద మేటలతో చిక్కుపడ్డ దాదాపు లక్ష మంది పరిస్థితి పరమ దయనీయంగా మారింది. వారం రోజుల ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు , వేడుకలను డాక్యుమెంటరీగా తీసేందుకు వచ్చిన వారు ఇప్పుడు అక్కడి భయానక స్థితిని చిత్రీకరించాల్సి వచ్చింది. ఇక్కడి వార్షిక మేళాకు తరలివచ్చిన వారిలో హాలీవుడ్ ప్రముఖులు, మిలియన్ డాలర్లకు పడగలెత్తిన సంపన్నులు ఎందరో ఉన్నట్లు వెల్లడైంది. ఇక్కడ బురద పూర్తిగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితుల నెలకొనేందుకు మరికొద్ది రోజులు పడుతుందని తెలియడంతో రెండు రోజులుగా ఇక్కడ చిక్కుపడ్డ వారు విస్తారిత బురదలోనే అతి కష్టం మీద అడుగులు తీసి అడుగులు వేస్తూ కిలో మీటర్ల దూరంలోని సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు నానా అవస్తలు పడాల్సి వస్తోంది. హాలీవుడ్ కమెడియన్ క్రిస్ రాక్, డిజె డిపియో వంటి వారు ఇతరులతో కలిసి ప్రమాదకరమైన బురద ముంపులోనే నాలుగు కిలోమీటర్ల దూరం సాగే వరకూ చుక్కలు కన్పించే స్థితిని ఎదుర్కొన్నారు.

తమ జీవితంలో ఇంతకంటే దారుణమైన షూటింగ్ మరోటి చూడలేదు, చేయలేదని కమెడియన్లు వాపొయ్యారు. నాలుగు గంటలు దాదాపుగా బురదలో ఈదుతున్నంత పనిచేసిన తరువాత చివరిలో ఫ్యాన్ల తోడ్పాటుతో ఈ హాలీవుడ్ నటులు అటుగా వెళ్లుతున్న ట్రక్కులోకి దూకి తమ నివాసాల వైపు వెళ్లారు. తమ పరిస్థితి గురించి హాలీవుడ్ నటులు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియచేసుకున్నారు. బ్లాక్ రాక్ ప్రాంతంలో బురద పేరుకుపోయి వేలాది మంది చిక్కుపడటంతో వారికి అవసరం అయిన వైఫై సౌకర్యాలు , మాట్లాడుకునేందుకు సెల్ ఫోన్ల ఆటంకాలు లేకుండా చేస్తామని , నాలుగు రోజుల వరకూ చిక్కుపడ్డ ప్రాంతంలోనే ఎక్కడి వారు అక్కడనే ఉండాలని అధికారులు ఆదేశించారు. అయితే వేలాది మందికి ఎటుచూసినా బురద తప్పితే ఏమి కన్పించని వైనం, టాయ్‌లెట్ల దుస్థితి , ఏమి చేయలేని అశక్తత జీవన్మరణ నరక సమస్యను తెచ్చిపెట్టింది. ఏదో ఉత్సవం చూద్దామని అనుకుంటే ఉపద్రవంలో చిక్కామని పలువురు కంటిపై కునుకు లేకుండా గడపాల్సి వచ్చింది. ఫెస్టివల్‌ను సినిమాగా మలుస్తామని తాము పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో వచ్చామని అయితే ఈ దారుణ స్థితిని సిన్మాగా మల్చాల్సి వచ్చిందని ఇక్కడికి వచ్చిన ఓ డాక్యుమెంటరీ దర్శకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News