Tuesday, September 17, 2024

కొమరం భీమ్ జిల్లా జైనూర్‌లో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

 ఇరువర్గాల మధ్య ఘర్షణ
 పలు దుకాణాలను దగ్ధం చేసిన ఇరువర్గాలు
 పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్‌పి
 144 సెక్షన్ అమలు
 ఘటనపై విచారణ జరపాలని: మంత్రి సీతక్క ఆదేశం

మన తెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి/జైనూర్: ఆసిఫాబాద్ జిల్లా, జైనూర్ మండలం, దేవ్‌గూడ గ్రామానికి చెందిన ఓ ఆదివాసీ మహిళపై ఒక మతానికి చెందిన వ్యక్తి లైంగిక దాడి చేసినందుకు నిరసనగా బుధవారం జైనూర్ మండల కేంద్రం రణరంగానికి దారితీసింది. ఆదివాసీ ప్రజలు పెద్ద ఎత్తున జైనూర్‌లోని పలు దుకాణాల సముదాయాలకు నిప్పంటించడంతో దీనికి నిరసనగా అవతలి వర్గానికి చెందిన వ్యక్తులు పరస్పర దాడులకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్ట్ 31న జైనూర్ మండలం, దేవులగూడకు చెందిన ఓ ఆదివాసీ మహిళ జైనూర్ మండల కేంద్రానికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా ఒక మతానికి చెందిన వ్యక్తి మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి దిగాడు.

ప్రతిఘటించిన ఆమెపై హత్యాయత్నం చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమె మరణించిందనుకుని రోడ్డుపై వదిలేసి ఆటో డ్రైవర్ వెళ్లిపోయాడు. అటుగా వెళ్తున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి కుటుంబీకులకు సమాచారం అందించారు. స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరళించారు. బాధితురాలి సోదరుడు జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు హైదరాబాద్ వెళ్లి చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలం తీసుకుని అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

జైనూర్ మండలంలోని ఒక మతానికి చెందిన దుకాణసముదాయాలకు నిప్పంటించారు. దీంతో ఆ మతానికి చెందినవారు పరస్పర దాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య రణరంగం ఏర్పడింది. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ అక్కడికి వెళ్లి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ఉదయం నుండి సిర్పూర్‌యు, జైనూర్ మండలాల్లో 144 సెక్షన్ అమలు చేసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పోలీసులు వెంటనే స్పందించి ఇరువర్గాలను సంజాయించి దాడులను నిలువరించారు. కాగా, గాయాలతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించి ఆరోగ్య బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పరామర్శ
జైనూర్‌లో ఆదివాసీ మహిళపై జరిగిన దాడి సంఘటనలో గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధిత మహిళను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద బుధవారం పరామర్శించారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత మహిళకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News