న్యూఢిల్లీ : అయోధ్యలోని రామాలయంతో పాటు మతపరమైన పలు సంస్థలపై దాడికి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఆ కుట్రను గుజరాత్ పోలీసుల భగ్నం చేశారు. గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక బృందం (ఎటిఎస్) పోలీసులు హర్యానా ఫరీదాబాద్లో గల పాలి ప్రాంతంలో ఒక టెర్రరిస్ట్ను అరెస్టు చేశారు. వారుఅతని దగ్గర నుంచి రెండు గ్రనేడ్లు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఏజెన్సీలు ఫరీదాబాద్ ఎస్టిఎఫ్తో కలసి సంయుక్తంగా గుజరాత్ ఎటిఎస్ ఉగ్రవాదుల కోసం గాలింపు ప్రారంభించింది. ఉగ్రవాదుల టార్గెట్లలో అయోధ్య రామ మందిరంపై దాడి చేయడం కూడా ఒకటిగా ఉన్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఫరీదాబాద్లో అరెస్టయిన ఉగ్రవాది ఉత్తర ప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహమాన్గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రనేడ్లను నిర్వీర్యం చేశారు. రెహమాన్కు టెర్రరిస్ట్ సంస్థలతో ఉన్న సంబంధం, అతని టార్గెట్కు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు అతనిని గుజరాత్కు తరలిస్తున్నారు. రెహమాన్ అరెస్టుతో భారీ ఉగ్ర దాడి కుట్ర భగ్నమైనట్లు పోలీసులు చెబుతున్నారు. కాగా, ఉగ్రవాదుల జాడ కోసం గుజరాత్ ఎటిఎస్ చేపట్టిన గాలింపు ఇంకా సాగుతున్నట్లు అధికారులు తెలియజేశారు. అబ్దుల్ రెహమాన్ అరెస్టు ద్వారా అయోధ్య రామాలయంపై దాడికి కుట్ర పన్నినట్లు బహిర్గతం కావడంతో అయోధ్యలో హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రామాలయం దగ్గర భద్రతను పటిష్ఠం చేశారు.