Thursday, September 19, 2024

థాయిలాండ్ ప్రధానిపై వేటు

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్ : నైతిక నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై థాయిలాండ్ ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఒక న్యాయస్థానం బుధవారం పదవిలో నుంచి తొలగించింది. ఒక వారం క్రితం ప్రధాన ప్రతిపక్షం రద్దుకు కోర్టు ఆదేశించిన తరువాత థాయ్ రాజకీయాల్లో మరింత సంక్షోభానికి దారి తీసింది. ఒక కోర్టు అధికారికి లంచం ఇవ్వజూపారనే అభియోగంపై జైలు శిక్ష అనుభవించిన ఒకరిని క్యాబినెట్ మంత్రిగా నియమించినందుకు స్రెట్టాపై రాజ్యాంగ న్యాయస్థానం ఈ చర్య తీసుకున్నది. కోర్టు 5:4తో స్రెట్టాపై ఈ తీర్పు వెలువరించింది. కొత్త ప్రధానిని పార్లమెంట్ ఆమోదించేంత వరకు ఆపద్ధర్మ ప్రాతిపదికపై మంత్రివర్గం కొనసాగుతుంది. ఆ ఖాళీని భర్తీ చేసేందుకు పార్లమెంట్‌కు ఎటువంటి గడువూ లేదు. ఏప్రిల్‌లో మంత్రివర్గ పునర్వవస్థీకరణలో పిచిత్ చుయెన్‌బాన్‌ను ప్రధాని కార్యాలయం (పిఎంఒ)లో ఒక మంత్రిగా స్రెట్టా నియమించారు.

మాజీ ప్రధాని తక్సిన్ షినవట్రాకు ప్రమేయం ఉన్న ఒక కేసులో ఒక సరకుల సంచీలో 20 లక్షల బహత్‌లు (55 వేల అమెరికన్ డాలర్లు) నగదుతో ఒక న్యాయమూర్తికి లంచం ఇవ్వజూపారనే ఆరోపణపై పిచిత్‌ను విచారించిన అనంతరం కోర్టు ధిక్కరణ అభియోగాలపై ఆయనను 2008లో ఆరు నెలల పాటు జైలులో ఉంచారు. మంత్రిగా నియుక్తుడైన కొన్ని వారాలకు ఆ ఘటనపై వివాదం తిరిగి రేగగా పిచిత్ తన పదవికి రాజీనామా చేశారు. పిచిత్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవించినప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశానుసారం ఆయన ప్రవర్తన అనైతికమని కోర్టు వ్యాఖ్యానించింది. తన క్యాబినెట్ నియామకాలకు సంబంధించి మంత్రుల అర్హతలను ముందుగా తేల్చుకోవలసిన ఏకైక బాధ్యత ప్రధానిగా స్రెట్టాదేనని కోర్టు స్పష్టం చేసింది. పిచిత్ గతం గురించి ఆయనకు తెలుసునని, కాని పదవిలో నియమించారని, అందువల్ల ఆయన నైతిక నిబంధనావళిని ఉల్లంఘించారని కోర్టు తీర్పులో పేర్కొన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News