సుమారు వందేళ్ల పాటు జరిగిన స్వాతంత్య్ర ఉద్యమంలో నాటి బ్రిటిష్ సంస్థానాల ప్రతిపత్తి గురించి ఎప్పుడు ప్రశ్నలు ఉదయించలేదు. సంస్థానాధీశులు అందరూ దాదాపుగా బ్రిటిష్ పాలకుల సుబేదార్ల వలే వ్యవహరించి, స్వాతంత్య్ర పోరాటంలో విద్రోహ పాత్ర వహిస్తూ వచ్చారు. బ్రిటిష్ పాలకులను గెంటివేయడం అంటే, వారి సుబేదార్లుగా ఉన్న సంస్థానాధీశులు సహితం గెంటివేసి, స్వాతంత్య్ర భారత దేశం ఏర్పాటు చేసుకోవడమే నాటి ఉద్యమకారుల లక్ష్యం. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్ధికంగా, రాజకీయంగా తీవ్రంగా నష్టపడడంతో మరెంతో కాలం భారత్లో తమ ఆధిపత్యం కొనసాగదని గ్రహించారు. ముఖ్యంగా వారి 1857లో వలే సైనిక తిరుగుబాటు రాగలదని భయపడ్డారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఆజాద్ హిందీ ఫౌజ్ సేనలు చెల్లాచెదురైనా వారెక్కడ తిరిగి ఒక్కటై తిరుగుబాటు చేస్తారో అనే భయం పట్టుకొంది. మరోవంక బ్రిటిష్ భారత్లో గల భారత సైనికులు పట్టుబడిన ఆజాద్ హింద్ ఫౌజ్ జనాలపై విచారణ జరిపే ప్రక్రియ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడా తిరుగుబాటు కూడా చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రపంచంలో ఎక్కడ విజయం సాధించినా అక్కడ భారత సైనికుల పరాక్రమాలు కారణం కావడంతో మళ్ళీ 1857 వంటి తిరుగుబాటు ఎదురైతే తట్టుకోవడం కష్టమని గ్రహించారు. అందుకనే భారత్ను బలహీనం చేసి, ఇక్కడి నుండి వెళ్లిపోవాలను కొన్నారు. ముందుగా మతం ప్రాతిపదికగా దేశాన్ని రెండు ముక్కలుగా విడదీసి రక్తపాతం సృష్టించారు.
మరోవంక సంస్థానాధీశులు ఏదో ఒక దేశంలో కలవడమో, లేదా స్వతంత్రంగా ఉండడంతో నిర్ణయించుకొని స్వేచ్ఛను ఇచ్చారు. ఈ నిర్ణయం స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఒక విధంగా వెన్నుపోటు పొడవడమే. పాకిస్థాన్ భాగంలోని సంస్థానాలు ఏవీ ఆ దేశంలో విలీనం కావడానికి ఇష్టపడకపోయినా బలప్రదర్శనతో కలుపుకున్నారు. కొందరు భారత్లో కలుస్తామని చెప్పినా నెహ్రూ తిరస్కరించారు. ఇక భారత్లో సర్దార్ పటేల్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి 500కు పైగా సంస్థానాలను విలీనం చేయగలిగినా, హైదరాబాద్, జమ్మూ కశ్మీర్, జనాగఢ్ విషయాలలో మెలిక ఏర్పడింది. చివరకు ఈ మూడు కూడా విలీనమైనా ఇప్పటికీ హైదరాబాద్ సంస్థానం విలీన విషయమై కొందరు రాద్ధాంతం చేస్తున్నారు.
నాటి హోమ్ మంత్రి సర్దార్ పటేల్ సైన్యాన్ని పంపించి నిజాం రాజ్యాన్ని ఆక్రమించుకున్నారని, హైదరాబాద్ సంస్థానం ఎప్పుడు బ్రిటిష్ పాలనలో భాగం కాదని, స్వతంత్ర దేశమని, అందుకనే దేశం అంతా వచ్చిన స్వాతంత్య్రం ఈ ప్రాంతానికి వర్తింపదని అంటూ వామపక్షాలతో పాటు ముస్లిం మతోన్మాదులకు వంత పాడుతున్న రాజకీయ నేతలు, పార్టీలు, కుహనా మేధావులు తరచూ వాదిస్తున్నారు.
అయితే చారిత్రక వాస్తవాలు గ్రహిస్తే నిజాం ఎప్పుడు స్వతంత్ర రాజు కాదని స్పష్టం అవుతుంది. మొదట్లో మొగల్ రాజులకు సుబేదార్ కాగా, ఆ తర్వాత బ్రిటిష్ పాలకులకు బానిసగా వ్యవహరించాడని అర్ధం అవుతుంది. స్వాతంత్య్ర దేశంలో అస్థిరత్వం నెలకొల్పడానికి బ్రిటిష్ పన్నిన కుట్రలకు నిజాం వత్తాసుగా నిలిచారని గమనించాలి. సంస్థానాధీశుల ఛాంబర్ చైర్మన్ ఒక పర్యాయం పామిర్ నుండి సిలోన్ వరకు, అరేబియా సముద్రం నుండి నెపాల్ వరకు ఒక విమానంపై వెళ్తుంటే వచ్చే ప్రాంతం అంతా – సుమారు 5 లక్షల చ.కి.మీ భారత దేశం అని అభివర్ణించారు. చాలావరకు ఇక్కడ సంస్థానాధీశులు ఎప్పుడు స్వతంత్ర పాలకులుగా లేనే లేరు.
1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని సొంతం చేసుకున్న బ్రిటిష్ పాలకులకు వీరంతా నమ్మిన బంటులుగా ఉంటూ వచ్చారు. ఇక్కడ విదేశీ పాలన కొనసాగడానికి, స్వాతంత్య్ర ఉద్యమాన్ని నీరు గార్చడం కోసం అత్యధికులు క్రియాశీలకంగా సహకరిస్తూ వచ్చారు. హైదరాబాద్ సంస్థానంలో సైతం నిజాంలు ఒక రాజ వంశానికి చెందిన వారు గాని, స్వతంత్ర పాలకులు కాదని గ్రహించాలి. మొగల్ రాజవంశంలో చివరి రాజయిన ఔరంగజేబు 1707లో మృతి చెందే సమయానికి వారి రాజ్యం ముక్కలు కావడం ప్రారంభమైనది. అంతకు ముందు ఛత్రపతి శివాజీ ఇచ్చిన తిరుగులేని దెబ్బ నుండి వారు కోలుకోలేదు. ఢిల్లీలోని తురినియన్ పార్టీలో బలమైన నాయకుడైన మొహమ్మద్ అమిర్ ఖాన్ సోదరుడు, అసఫ్ జహాగా పిలువబడే చిన్ కిలిచి ఖాన్ ను 1713లో దక్కన్ ప్రాంతానికి సుబేదార్గా ‘నిజాం -ఉల్-ముల్క్’ (రాజ్యాన్ని నియంత్రించేవాడు)ను నియమించారు. ఉత్తరాన మాళవ నుండి దక్షిణాదిన తిరుచిరాపల్లి వరకు విస్తరించిన దక్కన్ ప్రాంతానికి ఇది కీలకమైన పదవి.
అంతలో ఢిల్లీలో మొగల్ రాజ్యంలో కీలకులైన సయ్యద్ సోదరులు అదృశ్యం కావడంతో క్షీణ దశలో ఉన్న ఢిల్లీ వజీర్ పదవిని అసఫ్ జహాకు అప్పజెప్పారు. తెలివిగా ఆ పదవిని తిరస్కరించి దక్కన్కు తిరిగి వచ్చాడు. ఒక వంక ఢిల్లీ పాలకులకు అనుకూలంగా ఉంటూనే, మరోవంక ఇతరులకు సైతం లొంగి ఉండేవాడు. 1766లో సలాబత్ జహా తమ్ముడైన నిజం అలీ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీతో అవగహనకు వచ్చి పశ్చిమాన మరాఠాల నుండి, దక్షిణాదిన హైదర్ అలీ నుండి రక్షణ కల్పించే ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎక్కువకాలం అనువుగా ఉండకుండా హైదర్ అలీతో చేతులు కలిపాడు. ఇద్దరి సేనలు కలసి బ్రిటిష్ వారిపై దాడి చేశాయి.
1768 నాటికి ఆ దాడిని తిప్పికొట్టి, మచిలీపట్టణం ఒప్పందాన్ని చేసుకొని హైదరాబాద్లో ఒక బ్రిటిష్ రెసిడెంట్ను ఏర్పాటు చేసి, సైనిక స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. నిజాం ఒక వంక రెసిడెంట్ తో మాములుగా ఉంటూనే వెనుక బ్రిటిష్ వారిని తొలగించడానికి మరాఠాలతో చేతులు కలిపాడు. ఆ ప్రయత్నం వికటించడంతో నిజాం కోర్ట్ లో బ్రిటిష్ రాజు సైనిక అధికారిని ఉంచడం ప్రారంభించారు. దక్కన్లో బ్రిటిష్ ప్రాబల్యం పెరగడంతో నిజాం నిస్సహాయంగా ఉండిపోయారు. 1878 నాటికి దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ బలమైన సైనిక శక్తిగా ఎదగడంతో హైదరాబాద్ నుంచి ఫ్రెంచ్ సేనలను వెనుకకు పంపి, భారీ బ్రిటిష్ సైనిక బలగాలను అక్కడ ఉండేటట్లు నిజాంపై వత్తిడి తీసుకు వచ్చారు. అదే సంవత్సరం హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ సామ్రాజ్యాన్ని కూల్చివేశారు. ఆ రాజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసి, తమకు లొంగి ఉన్నందున కొంత భాగాన్ని నిజాంకు బహుమానంగా ఇచ్చారు. 1803 నాటికి హైదరాబాద్కు మరిన్ని బ్రిటిష్ సేనలు చేరుకున్నాయి. దక్షిణాదిన తమ ఆధిపత్యాన్ని నిలుపు కోవడం కోసం సికింద్రాబాద్ను భారీ సైనిక కేంద్రంగా చేసుకున్నారు.
1857లో దేశంలో పలు ప్రాంతాలలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జరుగుతున్న సమయంలో హైదరాబాద్లోని ముస్లింలు సహితం తిరుగుబాటు చేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ రెసిడెంట్ పై రెండుసార్లు దాడులు చేశారు. ఆ సమయంలో నిజాం చేరి ఉంటె మద్రాస్, మైసూర్, ట్రావంకోర్ -కొచ్చిన్ సంస్థానాలు సహితం తిరుగుబాటు చేసి ఉండేవి. అయితే ఆ ఉపద్రవం నుండి బ్రిటిష్ పాలకులను సార్ సాలార్ జంగ్ కాపాడారు. ఆ తర్వాత 150 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్ ప్రభుత్వంలో భాగంగానే నిజాం పాలన ఉండెడిది. నిజాంకు ఎప్పుడు మరే దేశంతో స్వతంత్ర సంబంధాలు ఉండెడివి కావు. నిజాం పాలన రక్షణతో పాటు కమ్యూనికేషన్స్, రైల్వేలు, విమానాలు, పోస్టల్ వంటి కీలక అంశాలను బ్రిటిష్ పాలకులే నిర్వహిస్తుండేవారు.
నిజాంకు సొంతంగా ఆయుధాలను దిగుమతి చేయడం, ఉత్పత్తి వంటి అధికారాలు ఉండెడివి కావు. హైదరాబాద్లో గల బ్యాంకులు అన్ని బ్రిటిష్ ఇండియా బ్యాంకులకు బ్రాంచ్లుగా ఉండెడివి. కాగా, నిజాం పరిపాలనను లౌకికతత్వానికి ప్రతీకగా కొందరు విపరీతమైన భాష్యం చెబుతున్నారు. నిజామ్ సంస్థానంలో 86 శాతం మంది హిందువులే అయినా అన్నింటా అల్పసంఖ్యాక ముస్లింలదే పెత్తనంగా ఉండెడిది. ఉన్నతస్థాయి ఉద్యోగాలలో 90 శాతంకు పైగా ముస్లింలే ఉండేవారు. నిజాం రాజ్యంలో ముస్లిం కానీ వారు ముస్లిం వ్యతిరేకి అని, ముస్లిం వ్యతిరేకి అన్నవారు ప్రభుత్వ వ్యతిరేకి అని కాళోజీ నారాయణరావు వ్యాఖ్యానించారు. మొహరం నెల నుండి 40 రోజుల వరకు హిందువుల ఇళ్లల్లో సైతం ఏ శుభకార్యం జరపడానికి వీలుండెడిది కాదు. ఇతర రోజులలో సైతం వ్రతాలు, పెళ్లిళ్లు జరుపుకోవాలి అంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కలెక్టర్ లేదా పోలీస్ కమిషనర్ అనుమతి లేకుండా హిందువులు కనీసం వ్యాయామశాలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీల్లేదు. దేశం నుండి బ్రిటిష్ పాలకులను వెళ్లగొట్టె ప్రక్రియ హైదరాబాద్ విముక్తితో పూర్తయిన్నట్లు గ్రహించాలి. హైదరాబాద్ విమోచనతోనే భారత స్వాతంత్య్ర పోరాటం సమగ్రతను సాధించుకొంది.
* చలసాని నరేంద్ర – 9849569050
The Nizam was not an independent head