Friday, October 18, 2024

విపక్షాలకు విజన్ లేదు

- Advertisement -
- Advertisement -

అధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారు

మనతెలంగాణ/హైదరాబాద్:  కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అభివృద్ధిపై విజన్ లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అ ధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలవారికి పథకాలు అమలు చేస్తున్న సిఎం కెసిఆర్‌పైనే ప్రజలకు నమ్మకమున్నదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉ ద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తె లంగాణ రాష్ట్రం భారతదేశానికి దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. తొమ్మిదిన్నరేండ్ల లో ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సా ధించి న ఘనత ఇది అని వ్యాఖ్యానించారు. నేడు తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నదని చెప్పారు.

రాష్ట్రంలో సమగ్ర, సమ తుల్య, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి కొ నసాగుతున్నదని వెల్లడించారు. 2023 శాసనసభ ఎన్నికలను పురస్కరించుకొని ఆయా ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య బాధ్యుల తో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి శ్రీ కా రం చుట్టింది. ఇందులో భాగంగా శనివా రం బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి, భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. టి యుడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విరాహత్ అలీ స్వాగత సందేశం ఇవ్వగా, ఐజెయు జాతీయ అధ్యక్షుడు కె.శ్రీనివాస్ రె డ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. రా ష్ట్ర, జాతీయ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు దాదాపు 130 మంది హాజరయ్యారు. గడిచిన పదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన ఆయా సంక్షేమ చర్యలు, భవిష్యత్తు లో చేప్పట్టే కార్యక్రమాల్ని ముందుగా కెటిఆర్ వివరించారు. అనంతరం జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు కెటిఆర్ సమాధా నం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజెయు స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, ఎం.ఎ.మాజీద్, జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు కల్లూ రి సత్యనారాయణ, హెచ్.యు.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, షౌకత్ హ మీద్ తదితరులు పాల్గొన్నారు. సంపద పెంచడమే కెసిఆర్ ప్రభుత్వ లక్ష్యం అని, తలసరి ఆదాయంలో తెలంగాణ నెం బర్‌వన్‌గా ఉందని కెటిఆర్ చెప్పారు. 2014 లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.14 లక్షలుగా ఉండగా, ప్రస్తుతం అది రూ.3 లక్షల 17 వేలకు పెరిగిందని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి వివక్ష, కులమత భేదాలు లేకుండా జీవిస్తున్నారని ఒకప్పుడు మైగ్రేషన్‌కు కేరాఫ్‌గా ఉన్న పాలమూరు ఇప్పుడు ఇరిగేషన్‌కు కేరాఫ్‌గా మారిందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌ను బిఆర్‌ఎస్ ప్రభుత్వం రూపుమాపిందని చెప్పారు. యాదాద్రి అభివృద్ధి, కాళేశ్వరంతో సాగునీరు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాల నినాదానికి కెసిఆర్ సంపూర్ణ న్యాయం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న ఆరోపణలు సరికాదని అన్నారు. కెసిఆర్ ఒక్క పైసా అప్పు చేసిన ఉత్పదాక రంగం మీద పెట్టారని తెలిపారు. అప్పులు చేసిన నిధులు సంపద సృష్టికి ఉపయోగిస్తున్నామని, రుణాలు మొత్తం సాగునీటి రంగం, మిషన్ భగీరథకు వినియోగించామన్నారు. విద్యుత్ సంస్కరణల కోసం రుణాలు తెచ్చామన్నారు.

అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యం సాధించాం
అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యం సాధించామని కెటిఆర్ చెప్పారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు సమతూకం కోల్పోతాయన్నారు. అప్పట్లో ఒక ప్రభుత్వం ప్రో అర్బన్, ప్రో ఐటీ రంగంపై ఫోకస్ పెట్టిందని.. ఆ తర్వాత వచ్చిన సర్కార్ వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టిందని తెలిపారు. కెసిఆర్ సర్కార్ పూర్తి సమతూకంతో ముందుకు సాగుతోందని.. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని వెల్లడించారు. ఎట్లా ఉండే తెలంగాణ… ఎట్లా అయ్యింది అన్నది ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించాలని కోరారు. తెలంగాణలో సంతులిత, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి జరుగుతోందన్నారు. అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జాతీయ అవార్డుల్లో పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి సింహభాగం అవార్డులు తెలంగాణకే దక్కాయని పేర్కొన్నారు. 7.7 శాతం గ్రీన్ కవర్ పెంచడం దేశంలోనే అద్భుతమని వ్యాఖ్యానించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటేసిందని చెప్పారు. నాస్కామ్ నివేదిక ప్రకారం ఐటి రంగంలో దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల ఉపాధి కల్పన జరిగిందని, అందులో హైదరాబాద్ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని కెటిఆర్ తెలిపారు. దేశంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్ నుంచే వచ్చాయని, బెంగుళూరు నుంచి 1.40 లక్షల ఉద్యోగాలు బెంగుళూరులో లభించాయని అన్నారు. ఐటి ఎగుమతులు 400 శాతం పెరిగాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. దేశానికి అన్నపూర్ణగా ఎదిగిందని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణకు ఇచ్చింది శూన్యమని విమర్శించారు.
కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడింది
తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్ అణచివేసిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని, దీంతో వందల మంది బలిదానాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేసిన పాపానికి తెలంగాణ 58 ఏండ్లు బాధపడిందన్నారు. రాజకీయ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని కెటిఆర్ విమర్శించారు. నియాగాంధీని బలిదేవత అని రేవంత్‌రెడ్డి అన్నారని కెటిఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, పదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎపిపిఎస్‌సి ద్వారా పది మొత్తం 24 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, అందులో తెలంగాణ వాటా 42 శాతం అనుకుంటే తెలంగాణకు 10 వేల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. ఉమ్మడి ఎపిలో తెలంగాణకు ఏడాదికి వెయ్యి ఉద్యోగాల చొప్పున ఇచ్చారని, కానీ తమ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. తమ ప్రభుత్వం ఏటా 13 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, ఇంత భారీ మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం ఏదైనా ఉందా..? అని అడిగారు. టీచర్ రిక్రూట్‌మెంట్ అంటే డిఎస్‌సి ఒకటేనా? అని కెటిఆర్ ప్రశ్నించారు. గురుకులాల్లో 20,894 టీచర్ టీచర్ పోస్టులు భర్తీ చేశామని, వారు ఉపాధ్యాయులు కారా..? అని అడిగారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
ఉమ్మడి రాష్ట్రంలో ఐదు వైద్య కళాశాలలు మాత్రమే ఉంటే, స్వరాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఉన్నాయని కెటిఆర్ చెప్పారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని పేర్కొన్నారు. కేంద్రంలోని బిజెపికి ప్రజలు పదేళ్లు అవకాశం ఇచ్చారని, ఏళ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదు. తాము అభివృద్ధి ఆధారంగా ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బిజెపి హామీ ఏమైంది..? నిలదీశారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్న ప్రధాని మోడీ హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలకు అభివృద్ధిపై విజన్ లేదని కెటిఆర్ విమర్శించారు. అధికారం కోసం అర్రాజ్ పాటలా హామీలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల ఖాతాలో రూ.15 లక్షలు ఏవన్నారు.
కర్ణాటకకు వెళ్లి ఆరా తీద్దాం.. సిద్ధమా?
కాంగ్రెస్ పార్టీ నేతలు కర్ణాటకను మోడల్‌గా చూపుతున్నారని, కానీ ఆ రాష్ట్ర రైతులు రాష్ట్రానికి వచ్చి ఆందోళన చేస్తున్నారని కెటిఆర్ ఎద్దేవా చేశారు. కర్ణాటక నుంచి రైతులను స్పాన్సర్ చేసి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని, అయితే కర్ణాటకకు వెళ్లి అక్కడి రైతుల పరిస్థితి ఆరా తీద్దాం….అందుకు సిద్ధమా..? అని సవాల్ విసిరారు. కర్ణాటకలో రైతులకు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని కెటిఆర్ ఆరోపించారు. 6 గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కర్ణాటక కరెంట్ కావాలా..? తెలంగాణ కరెంట్ కావాలా..? అని అడుగుదామని నిలదీశారు.
ఏజెన్సీనే మేడిగడ్డ పనులు పూర్తి చేస్తుంది
మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి పదేళ్లు పూర్తయ్యిందని,ఇటీవల బ్యారేజ్‌ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలించిందని చెప్పారు. ప్రజలకు సంబంధించిన ఒక్కపైసా వృథాకాకుండా, ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా ఏజెన్సీనే మేడిగడ్డ పనులు పూర్తి చేస్తుందని వివరించారు. 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని బ్యారేజ్ నిలబడిందని, కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్లు అందుతున్నాయని చెప్పారు. పార్టీల విమర్శలు సరికాదని అన్నారు. తాము పగ… ప్రతీకార రాజకీయాలు చేయలేదని, అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారని కెటిఆర్ అన్నారు. రేపు ఎప్పుడయినా ఆయన జైలుకు పోతాడేమో చూడాలంటూ వ్యాఖ్యలు చేశారు.
మోడీ బిసి ప్రధాని అయ్యారు.. ఏం ఒరిగింది..?
కులం కంటే గుణం ముఖ్యం అని, ఏ కులం వారు సిఎం అయితే ఆ కులానికి మేలు జరుగుతుందా..? అని కెటిఆర్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ బిసి అని, ఆయన ప్రధాని అయితే ఒబిసిలకు ఏమైనా మేలు జరిగిందా…? అని అడిగారు. బిజెపి ప్రకటించిన బిసి సిఎంపై కెటిఆర్ స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ ఓడితే బిసిలపై నెపం నెట్టే కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఒక వర్గం వాళ్లకు పదవి దక్కినంత మాత్రాన ఆ వర్గానికి మొత్తం మేలు జరిగినట్లా అని పేర్కొన్నారు. పదవి కంటే ఆ వర్గాలకు మేలు చేసే పథకం ముఖ్యమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బిజెపి 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, ఈ ఎన్నికల్లో కూడా 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రావని కెటిఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి కడితే 46 పైసలు తిగిరి వస్తున్నాయని కెటిఆర్ తెలిపారు. మిగతా నిధులు యుపి, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News