Friday, April 25, 2025

అమెరికా కోసమే దశాబ్దాలుగా ఈ దరిద్రపు పని

- Advertisement -
- Advertisement -
  • పాక్ రక్షణ మంత్రి ఒప్పుకోలు
  • ఉగ్రవాదులకు పాక్ నిధులు, శిక్షణ ఇచ్చింది
  • ఈ తప్పిదం పాక్‌కు చేటు తెచ్చిందన్న మంత్రి ఖ్వాజా ఆసిఫ్

లండన్ : పాశ్చాత్య దేశాల కోసం తమ దేశం ఉగ్రవాదుల సంస్థలకు దన్నుగా నిలుస్తున్నదని. శిక్షణ ఇస్తున్నదని, నిధులు సమకూరుస్తున్నదని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంగీకరించారు. ఈ తప్పిదం పాకిస్తాన్‌కు చేటు తెచ్చిందని ఆయన చెప్పారు. పహల్‌గామ్‌ల ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్తాన్ స్పందన, ఉగ్రవాదంపై వైఖరి గురించి స్కై న్యూస్‌కు ఇంటర్వూలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్‌ను న్యూస్ ప్రెజెంటర్ యాల్దా హకీమ్ ప్రశ్నించారు. ఇటీవల పహల్‌గామ్‌లో ఉగ్ర దాడిలో 26 మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ‘సార్, ఈ ఉగ్ర సంస్థలను సమర్థిస్తున్న, శిక్షణ, నిధులు ఇస్తున్న సుదీర్ఘ చరిత్ర పాకిస్తాన్‌కు ఉందని అంగీకరిస్తారా’ అని హకీమ్ అడిగారు. ‘నిజమే. మూడు దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్‌తో సహా పాశ్చాత్య దేశాల కోసం మేము ఈ దరిద్రపు పని సాగిస్తున్నాం’ అని ఆసిఫ్ సమాధానం ఇచ్చారు. ‘అది పొరపాటే. దాని వల్ల మేము నష్టపోయాం. అందుకు మీరు నాతో ఇలా అంటున్నారు. మేము సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా, ఇంకా 9/11 తరువాత యుద్ధంలో మేము చేరి ఉండకపోతే, పాకిస్తాన్‌దీ తిరుగులేని ట్రాక్ రికార్డు’ అని ఆయన అన్నారు. ‘ఈ ప్రాంతంలో ఏమి సంభవించినా పాకిస్తాన్‌ను నిందించడం అగ్ర రాజ్యాలకు ఎంతో సౌకర్యంగా ఉంటున్నది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా 19810 దశకంలో వారి పక్షాల పోరాడినప్పుడు, ఈనాటి ఈ ఉగ్రవాదులు వాషింగ్టన్‌లో విందు చేశారు. ఆతరువాత 9/11 దాడులు జరిగాయి. మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. అప్పట్లో మా ప్రభుత్వం పొరపాటు చేసిందని నా భావన’ అని ఆయన తెలిపారు. ఆ సమయంలో పాకిస్తాన్‌ను ‘పావుగా ఉపయోగించుకున్నారు’ అని ఆసిఫ్ అన్నారు. పహల్‌గామ్‌లో మంగళవారం నాటి ఉగ్ర వాడికి, దాడికి తన బాధ్యత ఒప్పుకున్న నిషిద్ధ లష్కరె తయ్యిబా (ఎల్‌ఇటి) అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టిఆర్‌ఎఫ్)కు పాకిస్తాన్‌ను నిందిస్తుండడం గురించి మంత్రిని ప్రశ్నించారు. ‘పాకిస్తాన్‌లో లష్కరె తయ్యిబా ఇక ఎంత మాత్రం ఉనికిలో లేదు. అది అంతరించింది. అది అంతరించింది&. మాతృ సంస్థ ఉనికిలో లేనప్పుడు అనుబంధ సంస్థ ఇక్కడ ఎలా ఊపిరి పోసుకుంటుంది’ అని ఆసిఫ్ అన్నారు. పహల్‌గామ్ ఉగ్ర దాడి ఫలితంగా పరిస్థితులు విషమిస్తాయని పాకిస్తాన్ భయపడుతోందా అని ప్రశ్నించినప్పుడు సముచిత రీతలో స్పందించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని మంత్రి ఆసిఫ్ సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News