ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను చంపేస్తానంటూ బెదిరింపులు రావడం చర్చనీయాంశంగా మారింది. చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్కు పంపించాడు. దీంతో విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్కు పరిచయం అయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పాడు. తమకు పనికివస్తాడని భావించిన శ్రీనివాస ప్రసాద్ పనితీరు చూశాక కాంట్రాక్ట్ ఇస్తామని చంద్రకిరణ్కు చెప్పాడు. ముందుగా కొంత పనిచేసి చూపించాడు, అవి శ్రీనివాస ప్రసాద్కు నచ్చలేదు.
అనుకున్న స్థాయిలో అతడు పనిచేయకపోవడం, సరైన ఫలితాలు రాకపోవడంతో చంద్రకిరణ్తో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే శ్రీనివాస ప్రసాద్ ఆఫీసు నుంచి పంపించేశారు. కొద్దిరోజుల క్రితం నుంచి తనకు డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాస ప్రసాద్కు చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడు. ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా చంద్రకిరణ్ డబ్బులు అడగడంతో శ్రీనివాస ప్రసాద్ ఆశ్చర్యపోయారు. తన ఆఫీసుకు వచ్చి మాట్లాడాలని శ్రీనివాస ప్రసాద్ సూచించారు. కానీ, చంద్రకిరణ్ ఆఫీసుకు రాకుండా మెయిల్స్, మెసేజ్తో బెదిరించడం ప్రారంభించాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే విజయశాంతి, శ్రీనివాస ప్రసాద్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. వారి కుటుంబాన్ని రోడ్డుకు ఈడుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.