- నేడు పంజాబ్తో గుజరాత్ తొలి పోరు
అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్18లో భాగంగా మంగళవారం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గుజరాత్కు శుభ్మన్ గిల్ సారథ్యం వహిస్తున్నాడు. కిందటి సారి కూడా అతనే కెప్టెన్గా వ్యవహరించారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. అయితే సొంత మైదానంలో ఆడుతుండడం గుజరాత్కు కలి వచ్చే అంశంగా చెప్పొచ్చు.
ఫేవరెట్గా టైటాన్స్..
ఈ మ్యాచ్లో ఆతిథ్య గుజరాత్ ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, జోస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్, రబడా, సిరాజ్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. బట్లర్ చేరికతో గుజరాత్ బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. ఈ మ్యాచ్లో ఫిలిప్స్, బట్లర్, గిల్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సాయి కిశోర్, మహిపాల్ లొమ్రొర్, అనూజ్ రావత్, షారుక్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు కూడా జట్టుకు అందుబాటులో ఉన్నారు. బౌలింగ్లో కూడా గుజరాత్ బలంగా ఉంది. రబడా, రషీద్, కొయిట్జి, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. రెండు విభాగాల్లోనూ సమతూకంగా ఉన్న గుజరాత్ ఈ మ్యాచ్లో బోణీ కొట్టాలనే లక్షంతో కనిపిస్తోంది.
అందరి దృష్టి శ్రేయస్పైనే..
మరోవైపు ఈ మ్యాచ్లో అందరి దృష్టి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్పైనే నిలిచింది. కిందటి సీజన్లో కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్కు ట్రోఫీ సాధించి పెట్టిన అయ్యర్ను ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం రిటేన్ చేసుకోలేదు. అయితే మెగా వేలం పాటలో పంజాబ్ కింగ్స్ యాజమాన్యం రికార్డు ధరకు శ్రేయస్ను దక్కించుకుంది. అనుకున్నట్టే శ్రేయస్కే సారథ్య బాధ్యతలను అప్పగించింది. అతని కెప్టెన్సీలో పంజాబ్ ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. అయ్యర్ కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి జట్టును విజయపథంలో నడిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. జోష్ ఇంగ్లిస్, మాక్స్వెల్, స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కొ జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, ఫెర్గూసన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. దీంతో పంజాబ్కు విజయంపై కన్నేసింది.