Friday, September 20, 2024

విశాఖ రండి.. అన్నీ ఇస్తా

- Advertisement -
- Advertisement -
Tollywood Celebrities Meet AP CM Jagan
హైదరాబాద్ క్యాంప్ కార్యాలయంలో తనను కలసుకున్న తెలుగు సినీ ప్రముఖులతో ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: సినీపరిశ్రమ విశాఖపట్నం వస్తే అందరికీ స్థలాలతో పాటు స్టూడియోలు నిర్మిస్తామని ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సినిమా ప్రముఖులతో సిఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో సినీనటుడు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్. నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సినీ పరిశ్రమను నెమ్మదిగా విశాఖపట్నం తీసుకొచ్చే విధంగా దృష్టిపెట్టాలని సినీ ప్రముఖులకు సూచించారు. తెలంగాణాతో పోలిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆంధ్రా ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తోందని, తెలంగాణా 35 నుంచి 40 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందన్నారు.

ఈక్రమంలో ఆంధ్రా 60 శాతం వరకు కంట్రిబ్యూట్ చేస్తోందని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా, ప్రేక్షకులు, ధియేటర్లు కూడా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆదాయపరంగా కూడా ఇక్కడ ఎక్కువని, అలాగే ఇక్కడ వాతావరణం కూడా బాగుంటుందన్నారు. సినీ ఇండిస్ట్రీ విశాఖకు వస్తే చిత్రపరిశ్రమంలోని అందరికీ స్ధలాలు ఇస్తామని, అలాగే స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే వాళ్లకు కూడా విశాఖలో స్థలాలు ఇస్తామన్నారు. జూబ్లీహిల్స్ తరహా ప్రాంతాన్ని ఇక్కడ కూడా క్రియేట్ చేద్దామన్నారు. చిరంజీవి అన్నతో కూర్చుని టికెట్ రేట్ల అంశం పై విస్తృతంగా చర్చించానని, అందరికీ న్యాయం జరిగేలా మంచి ధరలు తీసుకొచ్చే ప్రయత్నం చేశామన్నారు. ప్రస్తుతం నిర్ణయించిన ధరలు రేట్లేనని సిఎం పేర్కొన్నారు. మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతోందని సిఎం పేర్కొన్నారు.

ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ దీనిపై ఒక కమిటీని కూడా నియమించామన్నారు. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా తనతో పంచుకున్నారని వివరించారు. ఈ విషయాలపై విస్తృతంగా తెలుసుకునేందుకు మిమ్నల్ని కూడా రమ్మని చెప్పామన్నారు. హీరో పారితోషకం, హీరోయిన్ పారితోషకం, దర్శకుడు పారితోషం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్మాణవ్యయం పరంగా కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయన్నారు. ఈ తరహా సినిమాల కోసం వారం రోజుల పాటు కచ్చితంగా ప్రత్యేక ధరలు నోటిఫై చేసే విధంగా ట్రీట్ చేయాలని చెప్పామన్నారు. తెలంగాణ కన్నా ఎపి నుంచే సినీ పరిశ్రమకు ఆదాయం ఎక్కువ వస్తోందని, 20 శాతం షూటింగ్‌లు రాష్ట్రంలో చిత్రీకరిస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఐఎండ్ పిఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్ పీఆర్ కమిషనర్, ఎపిడిసి ఎండి టి విజయ్‌కుమార్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఎపి సిఎంకు ‘చిరు’ కృతజ్ఞతలు 

ప్రముఖ నటుడు చిరంజీవి సిఎం జగన్‌కు పరిశ్రమ తరపు మరోసారి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్ చేశారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలన్నీ అన్ని కోణాల్లో అర్థం చేసుకుని పూర్తి అవగాహనతో, ఎంతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు భవిష్యత్ కార్యచరణను సూచిస్తూ ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగ ఉంటానని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరోమారు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే అధికారికంగా పరిశ్రమకు శుభవార్త అందుతుందని ఆశిస్తున్నానంటూ రాసుకొచ్చారు. అలాగే ‘మీరు ఇచ్చిన భరోసాతో మీరు చేసిన దిశానిర్దేశంతో తెలుగు పరిశ్రమ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళుతుందన్న నమ్మకంతో హృదయపూర్వక ఆనందాన్ని తెలిజేస్తూ సీఎం జగన్ ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News