Thursday, September 19, 2024

రాష్ట్రానికి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీ మంజూరు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల సిగలో ఒక్కొక్క పువ్వుగా రోజుకో విద్యా సంస్థ కొత్తగా వచ్చి చేరుతుంది. గిరిజన శాఖను మరింత వికసింపజేస్తున్నాయి. గిరిజన విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా, విద్యలో వారికి సమాన అవకాశాలే ధ్యేయంగా మంత్రి సత్యవతి రాథోడ్ నాయకత్వంలో గిరిజన సంక్షేమ శాఖలో కొత్తగా పలు విద్యా సంస్థలు మంజూరు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రానికి ట్రైబల్ రెసిడెన్షియల్ లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించింది. 60 మందికి ఇందులో సీట్లు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న రెండో విడత లా కౌన్సిలింగ్ లో ట్రైబల్ రెసిడెన్షియల్ లా కాలేజీలో గిరిజన, ఇతర విద్యార్థులు సీట్లను పొందే అవకాశం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇంటర్ తర్వాత ఇంటిగ్రేటెడ్ లా కోర్సుగా ఈ కాలేజీకి మంజూరు లభించింది. గ్రాడ్యుయేషన్‌గా కొనసాగే ఈ కోర్సులో 5 సంవత్సరాల న్యాయ విద్య ఉంటుంది. ఈ ట్రైబల్ రెసిడెన్షియల్ లా కాలేజీలోని 60 సీట్లలో 39 సీట్లు గిరిజనులకు, 6 సీట్లు దళితులకు, 7 సీట్లు వెనుకబడిన తరగతులకు, రెండు సీట్లు అగ్రవర్ణాలకు, రెండు సీట్లు క్రీడా విభాగం, రెండు ఎన్సీసీ విభాగం, మరొక సీటు ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకో సీటు వికలాంగుల కోటా కింద కేటాయించారు.

ఇటీవలే వరంగల్ లోని, నర్సంపేటలో దేశంలోనే తొలిసారిగా గిరిజన సైనిక్ స్కూల్ ను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. డిఫెన్స్ ఆధ్వర్యంలో కాకుండా బయట ఉన్న ఏకైక సైనిక్ స్కూల్ గా ఇది రికార్డు సాధించింది. అదే విధంగా కెమిస్ట్రీలో ట్రైబల్ పిజి ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులు రెండింటికి కూడా మంజూరు లభించింది. ఇందులో జడ్చర్లలో బాలురకు 40 సీట్లు, షాద్ నగర్ లో బాలికలకు 40 సీట్లు ఇంటిగ్రేటెడ్ పీజీ ఎమ్మెస్సీ కోర్సులో మంజూరు అయ్యాయి. వీటితో పాటు మరో రెండు కాలేజీల మంజూరుకు అనుమతి లభించాల్సి ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 వల్ల ఈ రెండు కాలేజీల అనుమతి ఇప్పటికే రావల్సి ఉన్నా రాలేదని అధికారులు మంత్రి సత్యవతి రాథోడ్ కు వివరించారు. వీటిలో ఒకటి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బిఎడ్), మరొకటి ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ ఉంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020 ప్రకారం బి.ఎడ్ ను ఇకపై నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు చేయడంతో త్వరలో గిరిజన శాఖకు ఈ ఇంటిగ్రేటెడ్ బి.ఎడ్ కాలేజీ రానుందని వివరించారు.

Tribal Welfare Residential Law College Granted to Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News