హైదరాబాద్: పురపోరు నామినేషన్ ఘట్టంలోనే అధికార టిఆర్ఎస్ బోణి కొట్టింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డును టిఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. ఈ వార్డు అభ్యర్థిగా సుదర్శన్ బరిలోకి దిగారు. అయితే ఆవార్డులో మరే అభ్యర్థి నామినేషన్దాఖలు చేయక పోవడంతో టిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక లాంఛనమైంది. అలాగే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని 17, 18 వార్డులను కూడా టిఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా నిలిచారు. దీనితో నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి మూడు వార్డులు టిఆర్ఎస్ ఖాతలోకి వెళ్లి పోయాయి. ఇదే పరిస్థితి మరికొన్ని వార్డుల్లో కూడా నెలకొని ఉన్నట్లుగా తెలుస్తుంది. టిఆర్ఎస్ చెందిన అగ్రనేతలు, మంత్రులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, శాసనసభ్యులు రంగంలోకి దిగి పలువార్డులను ఏకగ్రీవంగా టిఆర్ఎస్ సాధించేవిధంగా ముమ్మర యత్నాలలో నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తుంది.
భారీ ప్రదర్శనలు… ర్యాలీలు
టిఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేసే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనల్లో శాసనసభ్యులతో పాటుగా మంత్రులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ప్రదర్శనలు నిర్వహించి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ల పత్రాలను సమర్పించారు. అయితే ఇప్పటికే నామినేషన్స్ వేసిన టిఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ అధిష్ఠానం ఆదేశాలమేరకు బిఫారాలు అందించారు. అనేక ప్రాంతాల్లో నామినేషన్ల సందర్భంగా నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో కాం గ్రెస్ నాయకులు టిఆర్ఎస్లో చేరారు. మంత్రులు వారిని ఆహ్వానిస్తూ గులాబి ఖండువాలు కప్పారు. ప్రధానంగా నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజమాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో జిల్లామంత్రుల సమక్షంలో పలువురు స్థానిక కాంగ్రెస్,బిజెపి నాయకులు టిఆర్ఎస్లో చేరి టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు.
మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ సమక్షంలో యువజన కాం గ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకుడు ఇస్మాయిల్ టిఆర్ఎస్ ఖండువా కప్పుకున్నారు. మైనారిటీ సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభు ్వం చేస్తున్న కృషికి ఆకర్షితుడినై టిఆర్ఎస్లో చేరినట్లు ఇస్మాయిల్ చెప్పారు. టిఆర్ఎస్ గెలిస్తేనే పట్టణాబివృద్ధ్ది మరింత వేగ వంతమవుతుందని సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. టిఆర్ఎస్లో చేరుతున్న కాంగ్రెస్ నాయకులను ఆయన స్వాగతించారు. జిల్లాలవారిగా టిఆర్ఎస్ భారీ మెజారిటీ నమో దు చేసుకోనుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అలాగే ఖమ్మం జిల్లాలోని పలుపట్టణాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమానాకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారంతా ఇప్పటికే టిఆర్ఎస్కు మద్దతు ప్రకటింటిన విషయాన్ని ఆమెప్రస్తావించారు. నిజమాబాద్లో నిర్వహించిన ర్యాలీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని సమగ్రపట్టణాబివృద్ధి జరగలాంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో టిఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధించాలన్నారు. అన్నివర్గాల ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉందన్నారు. ప్రజలు మరోసారి టిఆర్ఎస్ను ఆశీర్వదిస్తారనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ఆశావాహులకు ఓదార్పు
నామినేషన్ల గడువు ముగిసే నాటికి పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసిన అభ్యర్థులు మినహా టిఆర్ఎస్ ఆశావాహులు నామినేషన్లను ఉపసంహరించుకుని టిఆర్ఎస్ పక్షాన ఎన్నికల ప్రచారంలో ఉండే చర్యలు ప్రారంభించారు. పూర్వ రంగారెడ్డి జిల్లాలో 251 స్థానాలకు ఎన్నికలు జరగుతుండటంతో టిఆర్ఎస్ నుంచే సుమారు 400 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. అయితే మంత్రి తలసాని రంగంలోకి దిగి ఇప్పటికే అనేక మందిని ఉపసంహరింపచేశారని నాయకులు చెప్పారు. మిగతావారు ఉపసంహరణ గడువులోగా తప్పుకుంటారని జిల్లానాయకులు చెప్పారు.
అలాగే మాజీ మంత్రి,శాసన మండలి సభ్యుడు మహేందర్ రెడ్డి ఆశావాహులను ఉపసంహరింపచేశారని నాయకులు చెప్పారు. పార్టీ అధిష్ఠానం బి ఫాం ఇచ్చిన అభ్యర్థులు మినహా మిగతా వారంతా నామినేషన్లను ఉపసంహరించుకోవాలని అధిష్ఠానం ఆదేశించడంతో ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అవకాశాలు రానివారికి నామినేటెడ్ పదవులు లభించనున్నట్లు సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనను శాసనసభ్యలు స్థానిక నాయకులకు తెలియచేస్తూ ఆశావాహులను విరమింప చేస్తున్నారు.
ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్న నాయకులు
ఏకగ్రీవాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న టిఆర్ఎస్ మున్సిపాలిటీ ఎన్నికల్లోను ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోంది. పట్టణాల్లోని స్థానిక నాయకులు ఏకగ్రీవంగా అభ్యర్థులను ఎన్నుకుంటే ఎన్నికల ఖర్చు మిగలడంతో పాటు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ నేపథ్యంలో అనేక మున్సిపాలిటీల్లో ఉపసంహరణ ముగింపు నాటికి మరిన్ని ఏకగ్రీవాలు అయ్యే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో ఏగ్రీవాలు అధికంగా అయ్యే అవకాశముందని టిఆర్ఎస్ అంచనావేస్తున్నారు. సింగరేణి అభివృద్దికి ప్రభుత్వం చేసిన కృషికి బహుమతిగా బెల్లంపల్లి 17వ వార్డులో టిఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు.
నామినేషన్ ప్రక్రియపై అధిష్ఠానం పర్యవేక్షణ
మున్సిపాలిటీ,కార్పొరేషన్ నామినేషన్ల ప్రక్రియను టిఆర్ఎస్ అధిష్టానం పర్యవేక్షించింది.అష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు జిల్లాలవారిగా నామినేషన్ల తీరు తెన్నులను సమీక్షించారు. మున్సిపాలిటీల వారిగా శాసన సభ్యులతో నివేదికలు తెప్పించుకుని ఆశావాహుల జాబితాలను అధిష్టానం సిద్ధం చేస్తోంది. బిఫారాలు పొందిన వారు మినహా ఇతరులు పోటీ నుంచి తప్పుకునే విధంగా ఎక్కడికక్కడ శాసనసభ్యులు నిర్వహించిన సమావేశాలు, నామినేషన్లు వేసిన ఆశావాహులు, పార్టీ అభ్యర్థి వివరాలు ఆధిష్ఠానానికి అందాయి. ఎట్టిపరిస్థితుల్లో తిరుగుబాటు దారులను ఉపేక్షించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యా యి. పార్టీ ఆదేశాల మేరకు పోటీలో ఉన్న టిఆర్ఎస్ అభ్యర్థికే పార్టీశ్రేణులు ప్రచారం చేయాలని ఆధిష్ఠానం ఆదేశించింది. స్థానికంగా ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రతిపాదనలను కూడా శాసనసభ్యులు పరిశీలించాలని ఆధిష్ఠానం పేర్కొంది.