తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2024) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ పరీక్షలో 31.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా సచివాలయంలో టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇ.వి.నరసింహారెడ్డి, ఎస్సిఇఆర్టి డైరెక్టర్ రమేష్, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గత నెల 2 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. టెట్కు మొత్తం 1,35,802 మంది అభ్యర్థులు హాజరు కాగా, 42,384 మంది(31.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
పేపర్ -1 పరీక్షకు 69,476 మంది హాజరుకాగా, 41,327 మంది(59.48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 2కు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు 69,390 మంది హాజరుకాగా, 23,755 మంది(34.24 శాతం) ఉత్తీర్ణత సాధించగా, సోషల్ స్టడీస్ సబ్జెక్టులో 66,412 హాజరుకాగా, 18,629 మంది(28.05 శాతం) ఉత్తీర్ణత సాధించారు. తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ,తమిళం, సంస్కృతంలో ఎనిమిది సెషన్లలో పేపర్ 1 పరీక్ష, 12 సెషన్లలో ఏడు భాషలలో పేపర్ 2 పరీక్ష నిర్వహించారు. ఫలితాలను https://schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు.
డిఎస్సికి టెట్ అర్హత తప్పనిసరి
ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టాలనుకునేవారికి టెట్ తప్పనిసరి. ఇందులో అర్హత సాధిస్తేనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. పేపర్-1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదవ తరగదతి వరకు బోధించే ఎస్జిటి పోస్టులకు, పేపర్ -2కు అర్హత సాధించిన అభ్యర్థులు 6 నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయు పోస్టుల నియామకాలకు నిర్వహించే డిఎస్సి హాజరయ్యేందుకు తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలాగే ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.