Monday, April 28, 2025

మానవత్వం చాటిన ఆర్‌టిసి కండక్టర్

- Advertisement -
- Advertisement -

ఆర్‌టిసి కండక్టర్ వెంకటేశ్వర్లు మానవత్వం చాటుకున్నారు. బస్సులో పోగొట్టుకున్న రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఉదారత చాటుకున్న అచ్చంపేట డిపోనకు చెందిన వెంకటేశ్వర్లును ఆర్‌టిసి యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో సోమవారం ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండి సజ్జనార్ ఆయనను సన్మానించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అచ్చంపేట-హైదరాబాద్ రూట్ ఆర్‌టిసి బస్సులో ఈ నెల 26న కండక్టర్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఎంజిబిఎఎస్ కు చేరుకోగానే బస్సులో ఒక బ్యాగ్ ను ప్రయాణికుడు మరచిపోయినట్లు కండక్టర్ గుర్తించారు. బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు, వెండి ఆభరణాలు, నగదు, పలు సర్టిఫికెట్లు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్నిఅచ్చంపేట డిఎం మురళీ దుర్గా ప్రసాద్ కుఫోన్ లో కండక్టర్ సమాచారం అందించారు. బ్యాగ్ ను ఎంజిబిఎస్‌లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో అప్పగించాలని డిఎం సూచించారు.

ఇంతలోనే అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డిఎంకి ఫోన్ చేసి బస్సులో బ్యాగును మరచిపోయినట్లు చెప్పారు. కందుకూర్ లో బస్సు ఎక్కి సిబిఎస్ లో దిగి కాచిగూడకు వెళ్లిపోయానని పేర్కొన్నారు. ఎంజిబిఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలని డిఎం సూచించారు. ఆర్‌టిసి అధికారులు వివరాలను పరిశీలించి, బ్యాగును ప్రయాణికుడు అనిల్ కుమార్ కు అందజేశారు. అందులో 14 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.14,800 నగదు, తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్, తన విద్యార్హత ధ్రువపత్రాలు ఉన్నాయి.విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించి రూ.13 లక్షల విలువైన ఆభరణాలతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసిన కండక్టర్ వెంకటేశ్వర్లు ను సంస్థ ఎండి సజ్జనార్ అభినందించారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ఆర్‌టిసి సిబ్బంది ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ప, అచ్చంపేట డిఎం మురళీ దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News