* వ్యవసాయ యాంత్రీకరణలో చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి
* రైతులు ముందస్తు ప్రణాళికతో సాగుచేయాలి
* సన్నరకాల విత్తనాలు రైతులకు అందించేలా చర్యలు
* వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మన తెలంగాణ / హైదరాబాద్ : పసుపు రైతులు ఎవరు నష్టపోకుండా వారి పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం పసుపు రైతులకు గిట్టుబాటు ధరపై పసుపు బోర్డు ఎండి భవాని శ్రీ, మార్కెటింగ్ డైరెక్టర్ సురేంద్ర మోహన్ , నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ నామ్ పోర్టల్లో పసుపు పంటకు వచ్చే గరిష్ట ధరను ఆధారంగా చేసుకుని, నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా రైతులకు న్యాయమైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని, రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో మంత్రి తుమ్మల మాట్లాడారు. నేటి నుండి పొలం నుండి రైతులు నేరుగా మాట్లాడే అవకాశం ఉందని మంత్రి తుమ్మల వెల్లడించారు.
చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలి : వ్యవసాయ యాంత్రీకరణలో చిన్న, సన్న కారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతుల చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను రాజేంద్రనగర్ పరిశోధన స్థానం నుండి శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా వివరించారు. వరి పంట విషయంలో ప్రస్తుత పరిస్థితులలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి, రాజేంద్రనగర్ వరిపరిశోధన స్థానం నుంచి శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా రైతులకు వివరించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పద్దతిలో వరి పంటకు నీరు అందించాలని, దీనివల్ల నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు, అధిక దిగుబడులు కూడా సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు.
స్వల్పకాలిక రకాలను నవంబర్ లోనే సాగును ప్రారంభించినట్లయితే మార్చి మొదటి వారం వరకు వరికోతకు రావడానికి అవకాశం ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించి రైతులు ముందస్తు ప్రణాళికతో సాగుచేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా నీటి ఎద్దడిని అధికమించడంతో పాటు, వడగళ్ల వర్షం వంటి విపత్తుల నుండి కూడా వరి పంటను రక్షించుకోవడానికి వీలుకలుగుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. పవర్ టిల్లర్స్, పవర్ వీడర్, రోటోవేటర్ మరియు ట్రాక్టర్ తో నడిపే పరికరాలు, తైవాన్ స్ప్రేయర్స్ మొదలైన వ్యవసాయ పనిముట్లను సబ్సిడి మీద వెంటనే రైతులకు అందించుటకు తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ యాస్మిన్ బాషాకి మంత్రి సూచించారు. గత 5 సంవత్సరాల్లో టిజి సీడ్స్ నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో సంస్థ నష్టాల్లోకి వెళ్లిందని, టిజి సీడ్స్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం సంస్థ ద్వారా ఉత్పత్తి చేసిన సీడ్స్ని అంతా రైతులకు సరసమైన ధరలో అందించగలిగామని, గత 5 సంవత్సరాలలో సీడ్స్ ని నాన్ సీడ్గా అమ్మినందుకే దాదాపు రూ. 90 కోట్లు నష్టం వచ్చిందని తెలిపారు.
సన్నరకాల విత్తనాలు రైతులకు అందించేలా చర్యలు : సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన సన్నరకాల విత్తనాలను రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ కి సూచించారు. కందులు, మినుములు, సన్ ఫ్లవర్, శనగలు మొదలైన పంటల విషయంలో నాణ్యమైన విత్తనాలను సీడ్ కార్పొరేషన్ ద్వారా అందించాలన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా నిర్వహిస్తున్న జిన్నింగ్ మిల్లు గత నాలుగు సంవత్సరాలుగా ఉపయోగంలో లేదని, ఈ సంవత్సరం దాని జిన్నింగ్ పనిని ఆరంభించామన్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్న గోదాములు 100 శాతం పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం మద్ధతు ధరతో కొనుగోలు చేస్తున్న కందులు, శనగలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు మొదలైన పంటల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్ రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, సీడ్ కార్పొరేషన్ ఎండి యాస్మిన్ బాషా, సీడ్ సర్టిఫికేషన్ ఎండి కేశవులు, మార్క్ ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.