Saturday, September 28, 2024

నగరంలో డ్రగ్స్ పట్టివేత

- Advertisement -
- Advertisement -

నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 16గ్రాముల కొకైన్, 4.1 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బాలానగర్ ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూకట్‌పల్లి వడ్డపల్లి ఎన్‌క్లేవ్ వద్ద ఎండిఎంఏ డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 4.1 గ్రాముల ఎండిఏంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. షేక్ ఫరూక్ అనే యువకుడు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన సిఐ శ్రీధర్, ఎస్సై రఘు, సిబ్బంది మాటువేసి ఉన్నారు. నిందితుడు అక్కడికి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు.

ఎడిఎంఎ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని షేక్ ఫరూక్‌ను అరెస్టు చేసి జెఎఫ్‌సిఎం కోర్టు ముందు హజరుపరిచారు. షేక్‌ఫరూక్ చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీని నుంచి బయటపడేందుకు స్నేహితుల సలహా మేరకు తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశారు. బెంగళూరులో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. గ్రాము ఎండిఎంఎను రూ. 12 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎండిఎంఏ డ్రగ్స్ విలువ రూ. 50,000 ఉంటుంది. హెడ్‌కానిస్టేబుళ్లు లేఖాసింగ్, అలీం, కానిస్టేబుల్ కార్తీక్, రాజేష్, వికాస్ పాల్గన్నారు.

ఫిలింనగర్‌లో…
కొకైన్ విక్రయిస్తుండగా నైజీరియా దేశానికి చెందిన వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 16గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన ఒకొరియా కాస్మోస్ అలియాస్ ఆండీ ఇండియాకు వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. గోవా, ముంబాయి తదితర ప్రాంతాల నుంచి కొకైన్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి ఇక్కడ అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. నగరంలోని పలువురు యువకులు ఆండీ వద్ద రెగ్యులర్‌గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. గత కొంత కాలం నుంచి ఆండీపై నిఘా పెట్టిన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News