Friday, September 20, 2024

మాస్కోను లక్ష్యంగా చేసుకున్న ఉక్రెయిన్.. డ్రోన్లతో దాడి

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మాస్కో లక్షంగా ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించిందని, రాజధాని దిశగా సాగుతున్న డ్రోన్లు అన్నిటినీ తాము నాశనం చేశామని రష్యన్ అధికారులు బుధవారం వెల్లడించారు. మంగళవారం రాత్రి 45 ఉక్రెయినియన్ డ్రోన్లను రష్యా కూల్చివేసిందని రష్యన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలియజేసింది. మాస్కో ప్రాంతంపై 11 డ్రోన్లు, బ్రియన్‌స్క్ ప్రాంతంపై 23, బెల్గొరాడ్ ప్రాంతంపై ఆరు, కలుగా ప్రాంతంపై మూడు, కుర్‌స్క్ ప్రాంతంపై రెండు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఆ శాఖ వివరించింది.

‘డ్రోన్లతో మాస్కోపై దాడికి అత్యంత భారీ యత్నాల్లో ఇది ఒకటి’ అని మాస్కో మేయర్ సెర్జీ సోబ్యనిన్ తన ‘టెలిగ్రామ్’ చానెల్‌లో తెలిపారు. రాజధాని చుట్టూ గల పటిష్ఠమైన భద్రత ఏర్పాట్ల వల్ల ఆ డ్రోన్లు తమ లక్షాలను తాకే లోపే కూల్చివేయడం సాధ్యమైందని మేయర్ తెలిపారు. వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లను ధ్వంసం చేస్తున్న వీడియోలను రష్యన్ సోషల్ మీడియా చానెళ్లు కొన్ని పంచుకున్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న బ్రియన్‌స్క్ ప్రాంతం గవర్నర్ అలెగ్జాండర్ బొగొమజ్ తమ ప్రాంతంపై ‘భారీ ఎత్తున’ దాడి జరిగినట్లు, కానీ 23 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలియజేశారు.

తూర్పు యూరప్‌లో భూ వివాడంతో ఉక్రెయిన్ ఒక వైపు ఇరుక్కుపోగా మరొక వైపు తమ డ్రోన్లతో రష్యాపై దాడి సాగిస్తోంది. రష్యా పోరాట పటిమను దెబ్బ తీసేందుకు ఆయిల్ రిఫైనరీలను, వైమానిక దళ క్షేత్రాలను ఉక్రెయిన్ లక్షం చేసుకుంది. రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ పలు మార్లు డ్రోన్లు ప్రయోగించింది. రష్యాలో పశ్చిమ కుర్‌స్క్ ప్రాంతం దిశగా ఉక్రెయిన్ దళాలు సాగుతూనే ఉన్న సమయంలో డ్రోన్ దాడులు జరిగాయి. కాగా, రష్యాలోకి సాహసోపేతంగా చొరబడడం ఉక్రెయన్ నైతిక స్థైర్యాన్ని పెంచింది. ఉక్రెయిన్ ఆశ్చర్యకర రీతిలో విజయాలు సాధిస్తుండడం ఆ పోరు తీరును మార్చివేసింది. అయితే, కుర్‌స్క్‌తో తాను స్వాధీనం చేసుకున్న ప్రాంతంపై ఆధిపత్యాన్ని ఉక్రెయిన్ ఎంత కాలం నిలబెట్టుకుంటుందనేది అనిశ్చితంగా ఉన్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News