కీవ్ : రష్యాతో భూభాగ మార్పిడికి తాము సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే రష్యా ఉక్రెయిన్ భూభాగాలను విడిచిపెడితే తమ అధీనంలో ఉన్న కుర్స్ను వారికి అప్పగిస్తామని షరతు పెట్టారు. వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని అప్పటివరకు చూద్దామని బదులిచ్చారు. తాము అనుకున్నది జరగాలంటే రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. ఇందుకు గాను అమెరికాకు చెందిన సంస్థలకు ఉపయోగపడే పునర్నిర్మాణ ఒప్పందాలు చేసుకుంటున్నామని జెలెన్స్కీ అన్నారు. తమ వద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్ లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపారు.
2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డోనెస్క్ , ఖేర్సన్, లుహాన్స్ , జాపోరిజ్జియా ప్రాంతాలను తన నియంత్రణ లోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై మాస్కోకు పూర్తి నియంత్రణ లేదు. రష్యాఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. తన రాయబారి కీత్ కెల్లాగ్ను త్వరలో కీవ్కు పంపనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చేవారం మ్యానిచ్లో జెలెన్స్కీతో భేటీ అవుతారని అక్కడి అధికారి తెలిపారు. ఇటీవల పుతిన్తో తాను ఫోన్లో మాట్లాడానని ట్రంప్ స్వయంగా తెలిపారు. యుద్ధం వల్ల అమాయక ప్రజలు చనిపోవడం ఆపాలని పుతిన్ కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా చేస్తున్న సాయానికి 500 మిలియన్ డాలర్ల డీల్ను ప్రతిపాదించగా, దీనికి వారు సైతం అంగీకరించారన్నారు.