Thursday, February 27, 2025

ఎవరిని అడిగి హామీలిచ్చారని కేంద్రం సాయం చేయాలి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారా? అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేస్తానని చెప్పారా.. ప్రాజెక్టులకు రూపకల్పన చేశారా? రాష్ట్రాలు ఇలా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. లేనిది ఉన్నట్టుగా చెప్పడం అలవాటైందని, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అనేక ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు వివిధ విభాగాలతో మాట్లాడి ఉత్తరాలు రాస్తూ అభివృద్ధి పనులు జరిగేలా చూస్తున్నానని, బెదిరింపు రాజకీయాలు చేస్తే ఎవరు భయపడేవారు లేరని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గురువారం స్పందించారు. రేవంత్ రెడ్డి మాటలను నమ్మేవారు ఎవరూ లేరని, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని నమ్మి ఇపుడు ఆయన ఎలాంటి గాలి మాటలు మాట్లాడుతారో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.

నేనేం ఆయన, కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాలతో పార్లమెంట్ లోకి రాలేదు..నేను తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారీని. రేవంత్ మాటలకు నేను జవాబుదారీని కాదు. ముఖ్యంగా ఒక్క విషయంలో అయినా ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే నేను ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించాలని సవాలు చేస్తున్నానని అన్నారు. చేతకాని ముఖ్యమంత్రి, దమ్ము లేని ముఖ్యమంత్రి, మాటలు చెప్పి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే ఎలాంటి ఆర్థిక ప్రణాళిక చేస్తారో కూడా ఓ కార్యాచరణ లేదని, మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎలా డబ్బులు తెచుకుంటారో కూడా ఆయనకు ఓ క్లారిటీ లేదన్నారు. ఇటీవలే ప్రాజెక్టును కేంద్రానికి పంపారని, అది అన్ని మినిస్ట్రీలకు సర్క్యులేట్ చేయాల్సి ఉంటుందని, ఏదో ఇలా పంపగానే అలా అయిపోదు. దానికో సిస్టం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి అవగాహన లేకుండా దుందుడుకుగా మాట్లాడుతున్నారని చెప్పారు. బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌కు తాను భయపడే వ్యక్తిని కాదని సీఎం రేవంత్ రెడ్డి పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బిజినెస్ పార్ట్‌నర్ అంటూ సీఎం రేవంత్ కామెంట్ చేశారు. కేసీఆర్ కోసమే కిషన్‌రెడ్డి పని చేస్తున్నారని, మెట్రో సహా ఇతర ప్రాజెక్టులను పూర్తి చేస్తే తనకు పేరుస్తుందనే కేంద్ర కేబినెట్‌లో అడ్డుకుంటున్నారని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ కు సీఎం రేవంతా లేకపోతే నేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గాలి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ కు తాను భయపడే వ్యక్తిని కాదని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను అడ్డుకున్నట్లుగా నిరూపించే దమ్ము రేవంత్‌కు ఉందా అని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, కానీ నెపం నాపై నెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ సీఎం కావడం తెలంగాణ ప్రజల దురదృష్టమని కిషన్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News