పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో చేసిన నిర్లక్షం కారణంగానే ప్రస్తుతం రైతాంగం సాగునీటికి సమస్యలు ఏర్పడుతున్నాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బుధవారం గాంధీభవన్లో మీడియా చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ ఏపీ కి దారాదత్తంగా నదీ జలాలను బిఆర్ఎస్ ప్రభుత్వం వదిలివేసిందన్నారు. కృష్ణ నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఏంసీలు ఇవ్వాలని బిఆర్ఎస్ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక రూల్స్ మార్చాలని వత్తడి తీసుకువచ్చినట్లు చెప్పారు. గోదావరి జలాల్లో పాపం అంతా కెసిఆర్ ప్రభుత్వానిదేనని,
తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టకపోవడమే అత్యంత నష్టదాయకం అని ఆయన తెలిపారు. ఖరీఫ్ లో ఉమ్మడి రాష్ట్రంలో కంటె ఎక్కువగా వరి పంట తెలంగాణ లో పండిందని, రబీ లో 56 లక్షల ఎకరాల పైగానే సాగు జరుగుతుందని, రబీ యాక్షన్ ప్లాన్ పై అధికారికంగా ప్రకటిస్తామని, రైతులకు ముందు ఇచ్చిన సమాచారం ప్రకారమే నీళ్లు ఇస్తున్నామని, తక్కువ నీటి ని సమర్దవంతంగా ఉపయోగిస్తున్నామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. మేడిగడ్డ దగ్గర ప్రమాద రక్షణ చర్యలు చేపట్టకపోయి ఉంటే గ్రామాలు కొట్టుకుపోతాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి(ఎన్డిఎస్ఏ) రిపోర్ట్ ఇచ్చిందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని మంత్రి ఉత్తమ్ సూచించారు.