Thursday, September 19, 2024

డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామ్‌రెడ్డిని ఇడి అరెస్ట్ చేసింది. కెనరా బ్యాంక్, ఐడిబిఎ బ్యాంక్‌లను మోసం చేసిన కేసులో చర్యలు తీసుకున్నారు. వెంకట్రామ్‌రెడ్డితోపాటు మరో ఇద్దర్ని కూడా ఇడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.8 వేల కోట్లతో బ్యాంకులను మోసం చేశారన్న కేసులో వెంకట్రామ్‌రెడ్డిపై అభియోగాలు ఉన్నాయి. ముందు సిబిఐ ఈ కేసులో దర్యాప్తు చేసింది. అనంతరం ఇడి ఎంట్రీ ఇచ్చింది. చాలా రోజుల నుంచి విచారించిన తర్వాత బుధవారం అదుపులోకి తీసుకుంది. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని నిధులు మళ్లించారన్న ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసింది. తీసుకున్న రుణాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నారని సిబిఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీని ఆధారంగానే ఇడి కేసు ఫైల్ చేసి ఎంక్వయిరీ చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు చెందిన 3300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేసింది.

ఇప్పటికే పలు బ్యాంక్‌ల నుండి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో వెంకట్రామిరెడ్డిని గతంలోనే అరెస్ట్ చేసింది. రుణాలు తీసుకుని దారి మళ్లించడంతో పాటు చెల్లింపులు చేయకపోవడంతో 2015లో సిబిఐని కెనరా బ్యాంక్ ఆశ్రయించింది. కెనరా బ్యాంక్ ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన సిబిఐ విచారణ జరిపింది. వెంకట్రామిరెడ్డికి చెందిన అనేక ఆస్తులను సీజ్ చేసింది. డెక్కన్ క్రానికల్ పత్రికకు చెందిన రూ.386 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో ఉన్న డెక్కన్ క్రానికల్ 14 ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. మొత్తం బ్యాంకుల నుండి రూ.8180 కోట్లు రుణాలు డెక్కన్ క్రానికల్ యాజమాన్యం పొందింది.

సిబిఐ కేసు నమోదు చేసిన తర్వాత ఇడి కూడా కేసు నమోదు చేసింది. సిబిఐ, సెబీతో పాటు మొత్తం డెక్కన్ క్రానికల్ స్కాం పై 6 ఎఫ్ ఐఆర్‌లు నమోదయ్యా యి. వెంకట్ రాంరెడ్డితో పాటు పికే అయ్యర్, ఆడిటర్ మని ఓమెన్‌లను అరెస్ట్ చేసింది. ఇడి విచారణకు వెంకటరామిరెడ్డి సోదరుడు వినాయక రవిరెడ్డి హాజరు కాలేదు. ఆయనను కూడా ఇడి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. డెక్కన్ క్రానికల్ మాజీ చైర్మన్ వెంకట్రామిరెడ్డికి మొదట్లో డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ క్రికెట్ టీం కూడా ఉండేది. ఈ టీం కోసం పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని దారి మళ్లించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. చివరికి వెంకట్రామిరెడ్డి కేసుల్లో ఇరుక్కోవడంతో బిసిసిఐ డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీని క్యాన్సిల్ చేసింది. దీంతో వెంకట్రామిరెడ్డి మరింత నష్టపోయారు. చివరికి ఫ్రాంచైజీ చెన్నైకు చెందిన సన్ నెట్ వర్క్ దక్కించుకుని హైదరాబాద్ సన్ రైజర్స్ అని పేరు మార్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News