Saturday, July 6, 2024

‘నీట్’ అవకతవకలపై మౌనం ఎందుకు?

- Advertisement -
- Advertisement -

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నది. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల మోడీ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం. నీట్ ఎగ్జామ్ మాత్రమే కాక… దేశంలోని ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎన్‌టిఎ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.

కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న 23 లక్షల మంది తల్లిదండ్రులు, విద్యార్థుల ఆశలపై మోడీ సర్కార్ నీళ్లు చల్లింది. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజు (జూన్ 04) న విడులైన నీట్ ఫలితాల ఆధారంగా పరీక్ష నిర్వహణ తీరు గమనిస్తే పేపర్ లీక్ అయిందని అర్థంకాక మానదు. దేశంలో అత్యంత కఠినంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నీట్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా 62 మంది విద్యార్థులకు 720/720 మార్కులు వచ్చి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అందులో 8 మంది విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ నుంచి సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి. ఎంతో మంది అవకాశాలు కోల్పోతారు. అలాంటిది ఒకే సెంటర్‌లో ఇంత మంది విద్యార్థులకు పెద్ద మొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రతి మదిని తొలిచే ప్రశ్న. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి మరి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడమంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) కుట్ర అర్థం అవుతుంది. దేశ ప్రజల, విద్యార్థుల దృష్టి ఎన్నికల ఫలితాలపై ఉండగా ఎన్‌టిఎ నీట్ ఫలితాలను విడుదల చేసి చేతులుదులుపుకునే ప్రయత్నం చేసింది. ఫలితాల అవకతవకలపై తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) చాలా చిత్రమైన సమాధానాలు ఇచ్చింది. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు పేర్కొంది. అసలు నీట్ లాంటి పరీక్షలకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదు. అయినప్పటికీ ఎందుకిలా చేశారో ఇప్పటికీ అర్థంకాని విషయం.1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో… దానికి ఏ ప్రాతిపదికను తీసుకున్నారో స్పష్టం చేయలేదు. +4, -1 విధానం ఉండే ఈ పరీక్షలో సాధ్యం కాని విధంగా కొంత మంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావడం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనేక అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఈ మొత్తం అంశం వివాదం కావడంతో ఇప్పుడు ఎన్‌టిఎ 1563 మందికి విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాంకింగ్‌నే జత చేస్తామని పూటకోమాట మాట్లాడుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానాతంటాలు పడుతున్నది. ప్రతిసారి విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల మోడీ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం. నీట్ ఎగ్జామ్ మాత్రమే కాక… దేశంలోని ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఎన్‌టిఎ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రతిసారి ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, ప్రతి ఏడాదికి దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రధాని మోడీ మౌనం వీడి సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు, లక్షలాది మంది తల్లిదండ్రులకు భరోసానివ్వాలి. తక్షణమే ప్రధాని స్పందించి మొత్తం అవకతవకలకు బాధ్యులెవరన్నది దేశ ప్రజలకు వివరించాలి. ఎన్‌టిఎ పాత్రపై అత్యున్నత దర్యాప్తు సంస్థ తో సమగ్ర విచారణ జరిపించి పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితో పాటు అక్రమంగా లబ్ధి పొందిన వారిపై చర్యలు తీసుకోవాలి. నీట్‌లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.

గడ్డం శ్యామ్
9908415381

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News