హైదరాబాద్ : సవాళ్లను ఎదుర్కొవడానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి యువత సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ తమిళిపై సౌందర్ రాజన్ సూచించారు. ఆర్కిటెక్చర్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. హైటెక్ సిటీ వద్ద ఉన్న శిల్పా రామంలో జెఎన్టీయూ హెచ్ స్నాతకోత్సవం జరిగింది. ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కిటెక్చర్ విద్యార్థులకు గవర్నర్ తమిళిసై పట్టాలు ప్రదానం చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. కొన్ని శతాబ్దాలుగా నిలిచి ఉన్న నిర్మాణాలు మన నైపుణ్యం, ప్రతిభకు నిదర్శనాలని ఆమె చెప్పారు. తమిళనాడులోని పలు ఆలయాలు మన ఆర్కిటెక్చర్ ప్రతిభకు నిదర్శనమన్నారు. ఏకశిలపై నిర్మించిన అనేక ఆలయాలు, నిర్మాణాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి, చెన్నై బీచ్లో మన్రో విగ్రహం నేటికి అద్భుతంగా ఉందని గవర్నర్ తెలిపారు.